యూపీ చెరుకు బెల్ట్ లో బీజేపీకి చుక్కలు-కాషాయ అభ్యర్ధులకు రైతులకు బకాయిల సెగ
ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి చెరుకు రైతులకు బకాయిల అంశం కాక రేపుతోంది. అధికారంలో ఉండగా.. చెరుకు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా కాలయాపన చేసిన యోగీ ఆదిత్యనాథ్ కు ఇప్పుడు రైతులు బుద్ది చెప్పేందుకు సిద్ఘంగా ఉన్నారు. దీంతో యూపీ చెరుకు బెల్ట్ లో ప్రచారానికి వెళ్లాలంటేనే బీజేపీ అభ్యర్ధులు జంకుతున్నారు.
యూపీలో ఏడు దశలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో తొలి రెండు దశల్లో భాగంగా పశ్చిమ యూపీలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో 50 సీట్లు చెరుకు బెల్ట్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ రైతులకు యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ బకాయిలు కూడా ఇప్పించకపోవడంతో ఇప్పుడు రైతులు బీజేపీ అభ్యర్ధులపై గుర్రుగా ఉన్నారు. దీంతో అక్కడికి వెళ్లేందుకు స్ధానిక ఎమ్మెల్యే అభ్యర్ధులు కూడా జంకుతున్నారు జాతీయ నేతలైతే సరేసరి. ఫైనల్ గా చెరుకు బెల్ట్ ఇప్పుడు బీజేపీ ఆశలకు గండి కొట్టేలా కనిపిస్తోంది.
యూపీలో చెరుకుశాఖ తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం పశ్చిమ యూపీలోని 119 చెరుకు మిల్లులు రైతుల నుంచి 465 లక్షల టన్నుల చెరుకును కొనుగోలు చేశాయి. వాటికి సంబంధించి వేల కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ పలుమార్లు డెడ్ లైన్లు పెట్టినా, హెచ్చరికలు చేసినా కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే బకాయిలు రైతులకుతీర్చాయి. మిగతా బకాయిలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో ప్రధానమైన 12 మిల్లులు రూ.1500 కోట్ల మేర రైతులకు బకాయిలు ఉన్నాయి. దీంతో ఆయా మిల్లల నుంచి రైతులకు బకాయిలు ఇప్పించడంలో విఫలమైన యోగీ సర్కార్ పై ప్రజాగ్రహం వెల్లువెత్తుతుంది.