సునంద పుష్కర్ మృతి కేసు: నాలుగేళ్లుగా ఆ గది సీజ్, ఎట్టకేలకు అప్పగింత
ఎట్టకేలకు లీలా ప్యాలెస్ హోటల్ యాజమాన్యానికి ఊరట లభించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, శశిథరూర్ భార్య సునంద పుష్కర్(51) మృతి కేసులో ఆ హోటల్ లోని ఓ గదిని దాదాపు నాలుగేళ్లుగా సీజ్ చేసి ఉంచగా, కోర్టు ఆదేశాల
న్యూఢిల్లీ: ఎట్టకేలకు లీలా ప్యాలెస్ హోటల్ యాజమాన్యానికి ఊరట లభించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, శశిథరూర్ భార్య సునంద పుష్కర్(51) మృతి కేసులో ఆ హోటల్ లోని ఓ గదిని దాదాపు నాలుగేళ్లుగా సీజ్ చేసి ఉంచగా, కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు సోమవారం ఆ గదిని తెరిచి.. హోటల్ యాజమాన్యానికి అప్పగించారు.
2014 జనవరి 17న శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హోటల్ లీలా ప్యాలెస్ లోని గది నంబర్ 345లో అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో ఏడాది దర్యాప్తు అనంతరం ఆమెకు విషమిచ్చి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఆమె మరణించిన రోజునుంచీ ఇప్పటి వరకు ఆ హోటల్ గదిని సీజ్ చేసి తమ ఆధీనంలో ఉంచుకున్నారు. విచారణ పేరిట తరచూ హోటల్కు వెళ్లి ఆ గదిని పరిశీలిస్తూ ఉండే వారు.
దాదాపు నాలుగేళ్లుగా తమ హోటల్ లోని ఓ గదిని పోలీసులు మూసివేయడం వల్ల గది పాడైపోయిందని.. పైగా అది వ్యాపారం మీద కూడా ప్రభావం చూపుతోందని హోటల్ యాజమాన్యం ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.
అంతేకాదు, ఆర్థికంగా కూడా తమకు చాలా నష్టం కలిగిందని పిటిషన్లో పేర్కొంది. ఈ క్రమంలో అక్టోబర్ 10న ఈ పిటిషన్ విచారణకు రాగా.. గదిని తిరిగి హోటల్కు అప్పగించేయాలని ఆరు రోజుల గడువు విధిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సునంద మృతి కేసులో దర్యాప్తు దాదాపు పూర్తి కావడం, ఇప్పటికే సాక్ష్యాలు సేకరించటంతోపాటు... ఎలాగూ ఫోరెన్సిక్ తుది నివేదిక త్వరలో రానున్న నేపథ్యంలో ఇంకా హోటల్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో దాదాపు మూడున్నరేళ్ల తర్వాత మూసిన ఆ గది తలుపులను తెరిచారు.












Click it and Unblock the Notifications