సునంద హత్య: శశి థరూర్ కు లైడిటెక్టర్ పరీక్ష!
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసులో లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించి అసలు విషయాలు బయటకు లాగాలని దర్యాప్తు చేస్తున్న అధికారులు భావించారు.
కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కు లైడిటెక్టర్ పరిక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారని తెలిసింది. శశి థరూర్ భార్య సునంద పుష్కర్ విష ప్రయోగంతోనే మృతి చెందారని ఢిల్లీలోని ఎయిమ్స్ అధికారులు దృవీకరించిన విషయం తెలిసిందే.
సునంద పుష్కర్ హత్య కేసులో కీలక వ్యక్తులను మరోసారి విచారించాలని ఢిల్లీ పోలీసులు సిద్దం అయ్యారు. శశి థరూర్ కుటుంబ స్నేహితుడు సంజయ్ దేవన్, డ్రైవర్ బజరంగి, సహాయకుడు నరైన్ సింగ్, సునందను పరిక్షించిన వైద్యుడిని పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు.
సునంద పుష్కర్ మరణించిన రోజు ఆమె గదిలో అల్ప్రాక్స్ టాబ్లెట్లు లభించాయి, లోధీ కాలనీలోని కెమిస్ట్ లను పోలీసులు విచారించి వివరాలు సేకరించారు. అల్ప్రాక్స్ టాబ్లెట్ల విష ప్రభావంతో సునంద పుష్కర్ మరణించిందని వైద్య నివేదికలో వెలుగు చూసింది.
సునంద పుష్కర్ కు ఎవరు అల్ప్రాక్స్ టాబ్లెట్లు తీసుకు వచ్చి ఇచ్చారు, ఎక్కడ కొనుగోలు చేశారు తదితర విషయాలు బయటకు లాగాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఇదే సందర్బంలో అతి త్వరలో శశి థరూర్ కు లైడిటెక్టర్ పరిక్షలు నిర్వహించాలని ఢిల్లీ పోలీసు అధికారులు నిర్ణయించారు.