హోటల్లో శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మరణించింది. ఆమె ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ గదిలో శుక్రవారం సాయంత్రం మృత్యు ఒడిలోకి జారి కనిపించింది. సునంద పుష్కర్ మృతదేహం లీలా హోటల్లోని 345 నెంబర్ గదిలో బయటపడింది. ఈ విషయం రాత్రి 8 గంటల ప్రాంతంలో బయటకు వచ్చింది. హోటల్ అధికారులు పోలీసులకు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది.
తన భర్త శశిథరూర్కు, తనకు మధ్య విభేదాలు లేవని ప్రకటించిన 24 గంటల లోపే సునంద పుష్కర్ మరణించింది. ఆమె ఎలా మరణించిందనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా, మరో కారణం చేత మరణించిందా అనే విషయాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంది. పుష్కర్ బస చేసిన గదిని పోలీసులు సీల్ చేశారు.
పాకిస్తానీ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్తో సునంద పుష్కర్, శశి థరూర్ ట్విట్టర్ వివాదానికి దిగిన విషయం తెలిసిందే. ఇది జరిగిన 24 గంటల్లోగానే సునంద పుష్కర్ శవమై తేలారు.శశిథరూర్ ఎఐసిసి సమావేశంలో ఉన్నప్పుడు సంఘటన జరిగినట్లు భావిస్తున్నారు. సునంద పుష్కర్ మృతదేహం పడకపై ఉందని పోలీసులు తెలిపారు. విషం తీసుకున్న సూచనలు గానీ, మృత్యువుతో పోరాడిన సూచనలు గానీ కనిపించడం లేదని అంటున్నారు.
సునంద శశిథరూర్తో పాటు గురువారంనాడు హోటల్కు వచ్చారని థరూర్ వ్యక్తిగత కార్యదర్శి అంటున్నారు. విషయం తెలిసిన వెంటనే థరూర్ హోటల్కు వచ్చారు. పాకిస్తాన్ కాలమిస్టును జోడిస్తూ శశి థరూర్, సునంద పుష్కర్ మధ్య వివాదం నడిచింది. బుధవారంనాడు ఈ గొడవంతా జరిగింది. తాము సంతోషంగా ఉన్నామని, అనధికారికమైన ట్వీట్స్ వల్ల అసంతృప్తికి గురయ్యామని శశి థరూర్, సునంద పుష్కర్ సంయుక్త ప్రకటన చేశారు. సునంద పుష్కర్, శశిథరూర్ 2010లో వివాహం చేసుకున్నారు.
ఆత్మహత్యనా..
శశి థరూర్ వైవాహికేతర సంబంధం వల్ల కలత చెందిన ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆరోగ్యం కూడా బాగాలేదని అంటున్నారు. ఆమె శవం పడకపై పడి ఉంది. అసాధారణమైన పరిస్థితులు చోటు చేసుకున్నట్లు లేదు. 57 ఏళ్ల శశి థరూర్, 52 ఏళ్ల సునంద పుష్కర్ 2010 ఆగస్టులో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి కూడా ఇది మూడో వివాహమే. సునంద పుష్కర్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగితే మరణానికి కారణాలు తెలియవచ్చునని అంటున్నారు.
పాక్ జర్నలిస్టు దిగ్భ్రాంతి
సునంద పుష్కర్ మృతికి పాకిస్తాన్ జర్నలిస్టు మెహర్ తరర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ ట్విట్టర్లో తన సంతాపం ప్రకటించారు. ఈ ఘటనపై ఎలా స్పందించాలో తెలియడం లేదని, నోట మాట రావడం లేదని ఆమె అన్నారు. సునంద ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె ఆశించారు.
థరూర్ సహాయకుడి వివరణ
సునంద పుష్కర్ మరణించిన విషయాన్ని రాత్రి ఎనిమిదిన్నర గంటలకు చూసినట్లు, ఏదో జరిగిందనడానికి ఆనవాళ్లు లేవని థరూర్ సహాయకుడు అభినవ్ కుమార్ అన్నారు. హోటల్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. మరణానికి కారణమేమిటనేది తాము చెప్పలేమని, విషం తీసుకున్న సూచనలు కూడా లేవని, ఏదో జరిగిందని చెప్పడానికి ఆధారాలు కూడా లేవని ఆయన అన్నారు.
థరూర్ శుక్రవారం ఉదయం ఎఐసిసి సమావేశానికి హాజరయ్యారని, తిరిగి వచ్చి చూసేసరికి లోపలి నుంచి తాళం వేసి ఉందని, దాంతో సునంద పడుకుని ఉండవచ్చునని భావించారని ఆయన అన్నారు. తాము వెళ్లి చూసేసరికి మరణించి ఉందని ఆయన అన్నారు. థరూర్ వెంటనే వైద్యుడిని పిలిచారని ఆయన చెప్పారు. ఇంటికి పెయింట్ వేస్తుండడంతో థరూర్ దంపతులు హోటల్లో దిగారని ఆయన చెప్పారు. గురువారం ఉదయం నుంచి వారు హోటల్లో ఉంటున్నారని చెప్పారు.