సునందకు కీలక విషయం తెలుసు: సుబ్రహ్మణ్యస్వామి, శశిథరూర్ ఆశ్చర్యం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి విషయమై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం స్పందించారు. సునంద నిజాలు చెప్పాలనుకున్నదని, శశిథరూర్ అబద్దాలకోరు అని ఆయన ధ్వజమెత్తారు.
సునంద నిజాలు చెప్పాలనుకున్నదని, అందుకే సునంద మృతి చోటు చేసుకుందని అభిప్రాయపడ్డారు. ఆమె మృతి చెందిన హోటల్ సిబ్బందిని కూడా ప్రశ్నించాలన్నారు. ఏదో కీలకమైన విషయం సునందకు తెలుసునని, దానిని ఆమె చెప్పాలనుకుందన్నారు.
ఢిల్లీ పోలీసులు సునంద కేసు విషయంలో హత్యాకేసుగా నమోదు చేయడంపై స్పందిస్తూ.. ఇది హర్షణీయమన్నారు. ఈ హత్యలో డబ్బుల పాత్ర ఉందన్నారు. అదే సమయంలో ఆయన శశిథరూర్ పైన మండిపడ్డారు. థరూర్ అబద్దాలకోరు అని, అతని నిజాలు దాస్తున్నాడని ఆరోపించారు.
సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి మలుపు తిరిగిన విషయం తెలిసిందే. ఆమె మృతిని హత్య కేసుగా ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల నివేదక ఆధారంగా కేసును హత్య నేరం కిందికి మార్చారు. సునంద పుష్కర్ మరణించి పడి ఉన్న గదిని పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఇటీవల తిరిగి సందర్శించారు. ఆమె మరణించినప్పటి నుంచి ఆ గదిని మూసేశారు. తిరిగి ఇప్పుడే తెరిచారు.
ఎయిమ్స్ ఈ నెల 29వ తేదీన నివేదికలను సమర్పించింది. ఆ నివేదికల ఆధారంగా హత్యా నేరం కింద కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ చెప్పారు. పుష్కర్ మృతి అసహజమైందని, విషం వల్ల జరిగిందని నివేదికలో తేలినట్లు ఆయన తెలిపారు. విషం నోటి ద్వారా గానీ ఇంజక్షన్ ద్వారా గానీ ఇచ్చి ఉంటారని ఆయన చెప్పారు. విసరా రిపోర్టు కోసం చూస్తున్నట్లు తెలిపారు.
కాగా, సునంద ఆస్తులు వేటినీ తీసుకోలేదని శశిథరూర్ కేరళ హైకోర్టుకు తెలిపారు. సునంద వల్ల వచ్చిన ఆస్తులను వెల్లడించనందుకు లోకసభకు ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పైన ఆయన సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. అసలు తన భార్య కెనడా పౌరురాలని, అందువల్ల హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆమె ఆస్తులను తాను పొందే అవకాశం లేదన్నారు.
ఎఫ్ఐఆర్ పైన ప్రశ్నించిన కాంగ్రెస్
ఢిల్లీ పోలీసులు సునంద పుష్కర్ కేసును హత్య కేసుగా నమోదు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. కాంగ్రెస్ నేత రషీ అల్వీ మాట్లాడుతూ.. మృతి చెందిన ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలు చేయడమేమిటని ప్రశ్నించారు. పోలీసుల తీరు పైన ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయన్నారు. కేసు విషయంలో పోలీసులు పారదర్శకత పాటించాలన్నారు. మరో కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఈ కేసులో ఒకరిని దోషిగా చెప్పడం సరికాదన్నారు. సునందను ఎవరు హత్య చేసింది నిజమైతే, ఎవరు చేశారో తెలియాలన్నారు.
శశిథరూర్ ఆశ్చర్యం
సునంద పైన విషప్రయోగం జరిగిందని వైద్యులు నిర్ధారించడంపై శశిథరూర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కేసును క్షుణ్ణంగా దర్యాఫ్తు చేస్తారనుకుంటున్నానని, పోలీసులకు తన వంతు సహకారం ఇందిస్తానని, తన భార్య మరణంలో ఎలాంటి కుట్ర ఉంటుందని తాము అసలు ఊహించలేదని, ఇందులో సరైన దర్యాఫ్తు జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు. నిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు. మృతికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలని అందరం కోరుకుంటున్నామన్నారు. కాగా, సునందను చంపిన విషం పోలోనియంగా వైద్యులు గుర్తించినట్లు తెలుస్తోంది.