కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్త సీఈసీ.. సునీల్ అరోరా నియామకం
ఢిల్లీ : సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రధాన కమిషనర్ గా నియమితులయ్యారు సునీల్ అరోరా. ప్రస్తుతం సీఈసీ గా విధులు నిర్వహిస్తున్న ఓపీ రావత్ పదవీకాలం వచ్చే నెల రెండున ముగియనుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్త ప్రధాన కమిషనర్ గా అరోరా ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. రావత్ పదవీ విరమణ రోజునే అరోరా కొత్త సీఈసీ గా బాధ్యతలు చేపట్టనున్నారు. మాజీ ఐఎఎస్ అధికారి సునీల్ అరోరా 2017 సెప్టెంబర్ లో ఎలక్షన్ కమిషన్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు.
బ్రాడ్ కాస్టింగ్, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శిగా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన సునీల్ అరోరా.. 1980 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి. ప్లానింగ్ కమిషన్, ఫైనాన్స్, జౌళిశాఖల్లోనూ పనిచేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖలో సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇండియన్ ఎయిర్ లైన్స్ సీఎండీగా కూడా సేవలందించారు అరోరా.