రాజకీయాల్లోకి రండి, లేకుంటే నిరాహారదీక్ష: రజనీ ఫ్యాన్స్
చెన్నై: ఈ ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని గోడలపై పత్రికల రూపంలో తెలియజేస్తున్నారు.
రాజకీయాలకు సంబంధించి ఆయన నోటి నుంచి ఒక ప్రకటన చేయాలని కోరుకుంటున్నారు. లేకుంటే నిరాహారదీక్షకు దిగుతామని రజనీకాంత్ అభిమాన సంఘాల సంఘం ప్రకటించింది. తమిళుల ఆరాధ్యదైవం ఎంజీఆర్ మాదిరిగా సూపర్స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.
అయితే రజనీకాంత్ మాత్రం దీనిపై ఇంత వరకు నోరు మెదపలేదు. రాజకీయాల్లోకి తన ఎంట్రీని ఆ పైవాడే నిర్ణయిస్తాడని ఆయన చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖరారైందని ఓ వర్గం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ ప్రభుత్వాల తీరుతో విసిగిపోయామని, తప్పనిసరిగా ఎన్నికల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు వాల్ పోస్టర్ల ద్వారా ప్రచారానికి తెరదీశారు. అందులో ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిని గుర్తించి, మీరు తప్పకుండా రాజకీయాల్లోకి రావాలని మేము కోరుకుంటున్నామన్నారు.
ఎప్పటినుంచో మేం కోరుకుంటున్న కోరిక ఇది. మీరు రాజకీయాల్లో ప్రవేశించే విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకండంటూ రజనీకాంత్ అభిమానుల సంఘం అందులో పేర్కొన్నారు. దీనిపై వెంటనే ఒక ప్రకటన చేయాలని వారు కోరారు. ఒకవేళ రజనీ ప్రకటన చేయకుంటే రాబోయే రోజుల్లో నిరాహారదీక్షకు కూడా ఉపక్రమిస్తామని పేర్కొన్నారు. నిరాహారదీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.