ఐపీఎల్, సీఎల్ లభ్దిదారుల జాబితా ఇవ్వండి: బీసీసీఐని కోరిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఛాంపియన్స్ లీగ్ల్లో లాభం పొందుతున్న బోర్డు పరిపాలకులు, క్రికెట్ ఆటగాళ్ల జాబితాను ఇవ్వాలని మంగళవారం బీసీసీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. పాలకులు కూడా లీగుల్లో జట్లను సొంతం చేసుకునేందుకు వీలు కల్పిస్తూ నిబంధనను సవరించడాన్ని బీసీసీఐ సమర్ధించుకుంటున్న సమయంలో కోర్టు ఈ సమాచారాన్ని కోరింది.
‘బీసీసీఐ అధికారులు లీగ్లో జట్లను కలిగి ఉండకపోతే స్వర్గమేమీ కూలిపోదు. ఒకవేళ బోర్డు అధ్యక్షుడికి సొంత ఫ్రాంచైజీ లేకపోతే మొత్తం ఐపీఎల్ ప్రాజెక్ట్ కుప్పకూలిపోదు. ఎలాంటి వాణిజ్యపరమైన లాభాలు లేకపోతే ఈ లీగ్ ప్రారంభమయ్యేదే కాదు. అధికారులతో పాటు ఇతరుల జాబితాను మాకు ఇవ్వండి' అని జస్టిస్ టీఎస్ ఠాకూర్, కలీఫుల్లాలతో కూడిన బెంచ్ తెలిపింది.

6.2.4 నిబంధనను మార్చకపోతే జట్లను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదని బోర్డు కౌన్సిల్ సీఏ సుందరం వాదనను కోర్టు తోసిపుచ్చింది. అసలు ఏ ఉద్దేశంతో ఆ నిబంధనను మార్చారో తెలుసుకోవాల్సిన అవసరం ఈ దేశ ప్రజలకు ఉందని కోర్టు అభిప్రాయపడింది.
మరోవైపు... ఐపీఎల్ మీడియా హక్కుల విషయంలో చేతులు మారిన రూ.425 కోట్ల ‘అసలు లబ్ధిదారులు' ఎవరనేది ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) పరిశోధిస్తున్నట్టు పార్లమెంట్లో కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications