యోగీ సర్కార్ కు సుప్రీం షాక్- కరోనాలో కన్వర్ యాత్రపై అభ్యంతరాలు-రద్దుకు సూచన
ఉత్తర్ ప్రదేశ్ లో జరగాల్సిన కన్వర్ యాత్రపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా సమయంలో కన్వర్ యాత్ర నిర్వహించేందుకు తాము అనుమతించబోమని జస్టిస్ రోహింగ్టన్ నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ యాత్ర నిర్వహణపై పునరాలోచించుకోవాలని యోగీ ఆదిత్యనాథ్ సర్కారుకు సూచించింది.
కరోనా సమయంలో కన్వర్ యాత్ర నిర్వహిస్తున్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు యోగీ సర్కార్ సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రతీ భక్తుడికీ ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నిర్వహించిన తర్వాతే యాత్రలో పాల్గొనేందుకు అనుమతిస్తామని కూడా చెప్పింది. అయినా సుప్రీంకోర్టు మాత్రం సంతృప్తి చెందలేదు. ప్రస్తుతం మనమంతా కరోనా బాధితులమేనని, మతపరమైన కారణాలు చూపుతూ కరోనా సమయంలో యాత్రలు నిర్వహించడం సరికాదని పేర్కొంది. యాత్ర నిర్వహణపై మీరు పునరాలోచిస్తారా లేక మమ్మల్నే ఆదేశాలు ఇమ్మంటారా అని యోగీ సర్కార్ ను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.

యూపీలో కన్వర్ యాత్ర నిర్వహించడం ఆర్టికల్ 21 కింద పౌరుల జీవించే హక్కుకు భంగకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది దేశమంతటికీ వర్తిస్తుందని వెల్లడించింది. కరోనా సమయంలో ఇలాంటి యాత్రల నిర్వహణ వల్ల పౌరుల జీవించే హక్కుతో పాటు ఆరోగ్యాన్నీ హరిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. పౌరుల సెంటిమెంట్ల కంటే రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కే ఉన్నతమైనదని అత్యున్నత న్యాయస్ధానం అభిప్రాయపడింది. కాబట్టి యోగీ సర్కార్ దీనిపై ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.












Click it and Unblock the Notifications