విడాకులపై సుప్రీంకోర్టుకు విచక్షణాధికారాలు
న్యూఢిల్లీ: వివాహాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువడించింది. రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ ఆధారంగా విచక్షణాధికారాలను ఉపయోగించే అధికారాలు సుప్రీంకోర్టుకు ఉన్నాయని తెలిపింది. దీని ఆధారంగా విడాకులను మంజూరు చేయవచ్చని పేర్కొంది. విడాకులను మంజూరు చేయడానికి ఫ్యామిలీ కోర్టులను సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
అయిదుమంది న్యాయమూర్థులు- జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓఖా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఈ ఆదేశాలను జారీ చేసింది. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు, వివాహ బంధాన్ని పునరుద్ధరించడం సాధ్యం కానప్పుడు సుప్రీంకోర్టు ఆ వివాహాన్ని రద్దు చేయగలదని పేర్కొంది.

రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ ఆధారంగా తన విచక్షణాధికారాలను ఉపయోగించి విడాకులను మంజూరు చేయవచ్చని తెలిపింది. దీనికోసం ఫ్యామిలీ కోర్టులను సంప్రదించనక్కర్లేదని పేర్కొంది. అలా విడాకులను మంజూరు చేయడం పబ్లిక్ పాలసీ లేదా ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం కాదని వ్యాఖ్యానించింది అయిదుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం. విడాకులను పొందడానికి ఆరు నెలల పాటు తప్పనిసరిగా వేచి ఉండాలని పేర్కొంది.
విడాకులను తీసుకోదలిచిన దంపతులు- పరస్పర అంగీకారంతో కనీసం ఆరు నెలల పాటు తప్పనిసరిగా నిరీక్షించాల్సి ఉంటుందని, గతంలో దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పుల్లో పొందుపరిచిన షరతులకు లోబడి ఉండాలని సూచించింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13బీ ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకుల కోసం తప్పనిసరి నిరీక్షణ వ్యవధిని మినహాయించవచ్చా? లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది.
ఈ కేసులో సీనియర్ న్యాయవాదులు ఇందిరా జైసింగ్, కపిల్ సిబల్, వీ గిరి, దుష్యంత్ దవే, మీనాక్షి అరోరా అమీసీ క్యూరీలుగా వ్యవహరించారు. కిందటి నెల 29వ తేదీ నాడే విచారణలను ముగించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. తీర్పును రిజర్వ్ చేసింది. ఇవ్వాళ తాజాగా తన తీర్పును వెలువడించింది. విడాకులను మంజూరు చేయడంలో విచక్షణాధికారాలను వినియోగించవచ్చని తెలిపింది.












Click it and Unblock the Notifications