నిర్భయ కేసులో ట్విస్ట్: అక్షయ్ సింగ్ రివ్యూ పిటీషన్ విచారణ నుంచి తప్పుకొన్న చీఫ్ జస్టిస్..!
న్యూఢిల్లీ: దేశం మొత్తాన్నీ వణికించిన నిర్భయ అత్యాచారం కేసులో దోషిగా తేలిన అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ పిటీషన్ పై విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డె తప్పుకొన్నారు. ఈ రివ్యూ పిటీషన్ పై తాన విచారణ చేయలేనని చెప్పారు. తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. దీనితో ఈ పిటీషన్ పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఆ సమయంలో నిర్భయ తల్లి ఆశాదేవి, తండ్రి న్యాయస్థానంలోనే ఉన్నారు.
హైదరాబాద్ ఎన్కౌంటర్ కేసును విచారించాల్సి ఉంది.. మీ గోలేంటీ?: జామియా విద్యార్థులకు సుప్రీం చీవాట్లు
పిటీషన్ లిస్టింగ్ ప్రకారం..
నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన ఆరుమంది దోషుల్లో అక్షయ్ కుమార్ సింగ్ ఒకడు. ఈ ఆరుమందికీ దేశ అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్షను విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ నలుగురూ తీహార్ కేంద్ర కారాగారంలో ఉన్నారు. రోజులు లెక్కపెడుతున్నారు. తనకు ఉరిశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ అక్షయ్ కుమార్ సింగ్ కొద్ది రోజుల కిందటే సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేశారు. ఆయన తరఫున ప్రముఖ న్యాయవాది ఏపీ సింగ్ ఈ పిటీషన్ వేశారు.
ముగ్గురు సభ్యులు ధర్మాసనం..
అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ పై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బొబ్డె, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ భానుమతిలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తొలుత వాదోపవాదాలను ఆరంభించింది. ఆ వెంటనే- ఎస్ ఏ బొబ్డె జోక్యం చేసుకున్నారు. తాను రివ్యూ పిటీషన్ విచారణ నుంచి స్వచ్ఛందంగా తప్పుకొంటున్నట్లు వెల్లడించారు.
కొత్త ధర్మాసనానికి బదలాయింపు..
అనంతరం- ఈ రివ్యూ పిటీషన్ ను మరో ధర్మాసనానికి బదలాయిస్తున్నట్లు బొబ్డె వెల్లడించారు. ఆ ధర్మాసనంలో తన ప్రాతినిథ్యం ఉండబోదని అన్నారు. ఇప్పుడున్న ధర్మాసనం సభ్యులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ భానుమతి కూడా కొత్త బెంచ్ లో ఉండకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ముగ్గురు సభ్యులతో కూడిన మరో ధర్మాసనం బుధవారం అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ పై విచారణ చేపడుతుంది.
ఇప్పటికే సగం చచ్చాం..
నిర్భయపై అత్యాచారం కేసులో తనకు విధించిన ఉరిశిక్షను పునఃసమీక్షించాలని కోరుతూ అక్షయ్ కుమార్ సింగ్ ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దేశ రాజధానిలో వాతావరణం అత్యంత విషపూరితంగా మారిందని, ఫలితంగా- జైల్లోనే సగం ప్రాణాలు పోయాయని అంటూ అక్షయ్ కుమార్ సింగ్ ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టులో రివ్యూ అక్షయ్ కుమార్ సింగ్ ఈ పిటీషన్ లో పేర్కొన్నారు. పీల్చే గాలి, తాగే నీరు.. అంతా కాలుష్యం వల్ల తమ ప్రాణాలను హరించవేశాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఉరిశిక్షను అమలు చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదని ఈ రివ్యూలో పేర్కొన్నారు.