సుప్రీంకోర్టుకు 9 మంది కొత్త జడ్జిలు: లిస్ట్లో జస్టిస్ జేకే మహేశ్వరి..జస్టిస్ హిమకోహ్లీ
హైదరాబాద్: కొత్తగా తొమ్మిదిమంది న్యాయమూర్తులు దేశ అత్యున్నత న్యాయస్థానంలో బాధ్యతలను స్వీకరించనున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు వారిని సిఫారసు చేసింది. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. వేర్వేరు రాష్ట్రాల హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా ప్రస్తుతం వారు పని చేస్తోన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ కూడా ఈ జాబితాలో ఉన్నారు. త్వరలో ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరిస్తారు.

జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని కొలీజియం..
ఈ ముగ్గురు మహిళా న్యాయమూర్తుల్లో ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం లాంఛనప్రాయమే అవుతుంది. వారి సీనియారిటీ, పదవీ కాలం ఆధారంగా ముగ్గురిలో ఒకరు దేశ అత్యున్నత న్యాయస్థానానికి మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ కావడం ఖాయం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు ఈ తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన జాబితాను రూపొందించింది. ఈ జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది.

కేంద్రానికి లిస్ట్..
కేంద్ర ప్రభుత్వం- ఈ జాబితాను ఆమోదించాల్సి ఉంది. ఆ వెంటనే వారంతా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం నాలుగైదు రోజుల్లో పూర్తి కావచ్చని తెలుస్తోంది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం యధాతథంగా ఆమోదించడం దాదాపు ఖాయమైనట్టే. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసిన సందర్భాలు పెద్దగా లేవు.

లిస్ట్లో ఉన్నది వీరే..
సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుల ప్రకారం- తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది ఉన్నారు. వారితో పాటు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏఎస్ ఓకా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీటీ రవికుమార్, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేష్ ఉన్నారు.

మహిళా న్యాయమూర్తికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఛాన్స్
అలాగే బార్ కోసం సీనియర్ అడ్వొకేట్ పీఎస్ నరసింహను సుప్రీంకోర్టు కొలీజియం రికమెండ్ చేసింది. ఈ తొమ్మిది మందిలో జస్టిస్ బీవీ నాగరత్నతో పాటు జస్టిస్ విక్రమ్ నాథ్, సీనియర్ అడ్వొకేట్ పీఎస్ నరసింహలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉండే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ జాబితాను యధాతథంగా ఆమోదించితే- సీనియర్ అడ్వొకేట్ పీఎస్ నరసింహ నేరుగా సుప్రీంకోర్టు బార్కు నామినేట్ అయిన తొమ్మిదో న్యాయవాది అవుతారు.

కొలీజియంలో జస్టిస్ లావు నాగేశ్వర రావు
కాగా- సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుడిగా కొనసాగిన న్యాయమూర్తి జస్టిస్ రోహిన్టన్ నారిమన్ రిటైర్మెంట్ తరువాత ఎంపిక చేసిన తొలి జాబితా ఇదే. 2019 నుంచి కొలీజియం సభ్యుడిగా కొనసాగారు రోహిన్టన్ నారిమన్. ఈ నెల 12వ తేదీన ఆయన పదవీ విరమణ చేశారు. నారిమన్ స్థానంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర రావు కొలీజియంలో సభ్యుడయ్యారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ఈ అయిదుమంది సభ్యులు గల కొలీజియంలో జస్టిస్ యుయు లలిత్, ఎఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూద్, లావు నాగేశ్వర రావు ఉన్నారు.












Click it and Unblock the Notifications