రాజీవ్ హత్య: దోషుల ఉరిశిక్ష జీవిత ఖైదుగా మార్పు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులకు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ మంగళవారం సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. క్షమాభిక్ష విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఆలస్యమైనందున తమ ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని పెట్టుకున్న పిటిషన్ పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.
సుప్రీం తీర్పుతో రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులైన శాంతన్, మురుగన్, పెరారీవాలన్ మరణ శిక్షకు బదులుగా జీవిత ఖైదును అనుభవించనున్నారు. క్షమాభిక్ష పిటీషన్లను ఆలస్యం చేయడం వల్ల తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. క్షమాభిక్ష పిటీషన్లపై రాష్ట్రపతి తీసుకునే నిర్ణయంపై ప్రభుత్వం కొంత సమయం కేటాయించే విధంగా చూడాలని కోర్టు అభిప్రాయపడింది.
క్షమాభిక్షపై తీసుకునే నిర్ణయం ఆలస్యమయ్యే విధంగా ఉంటే నిందితులకు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చే విధంగా చూడాలని సూచించింది. కాగా రాజీవ్ హత్య కేసులో దోషులకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
క్షమాభిక్ష పిటీషన్పై ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్లే నిందితులకు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పు వెలువరించినట్లు కోర్టు పేర్కొంది. కాగా సుప్పీం తీర్పు పట్ల నిందితుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.