సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్కు చుక్కెదురు: స్టేటస్ కో ఎత్తేసేందుకు నో, పిటిషన్ కొట్టివేత
అమరావతి రాజధాని మార్పునకు సంబంధించి సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దుకు సంబంధించి గవర్నర్ ఆమోదించిన బిల్లుపై హైకోర్టు స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా.. బుధవారం సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం విచారించింది. హైకోర్టు విధించిన స్టేటస్ కో ఎత్తివేయాలని కోరగా.. పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే. దీంతో సీఆర్డీఏ, వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం తమ పిటిషన్లో పేర్కొన్నది.
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు గత 200పై చిలుకు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. హైకోర్టులో కొందరు పిటిషన్ వేయగా.. ధర్మాసనం స్టే విధించింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం.. స్టేటస్ కో ఎత్తివేసేందుకు నిరాకరించింది. దీంతో రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.