మర్కజ్ తరహాలో... మళ్లీ అదే సమస్య ఉత్పన్నమవొచ్చు... రైతుల ఆందోళనలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
దాదాపు గత 40 రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపడుతున్న ఆందోళనలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుల నిరసన ప్రదేశాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే గతేడాది 'తబ్లిగీ జమాత్' కారణంగా ఎదురైన సమస్య మళ్లీ ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది. 'ఆందోళనల్లో పాల్గొంటున్న రైతులకు కోవిడ్ 19 సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా.. అసలు అక్కడ ఏం జరుగుతుందో మీరు న్యాయస్థానానికి చెప్పాల్సిందే..' అంటూ సుప్రీం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 'అప్పుడే అంతా అయిపోయిందని భావించవద్దు. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తపడాలి. ఇందుకోసం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి.' అని సుప్రీం కోర్టు సూచించింది.
Recommended Video
మర్కజ్ ఘటనపై పిటిషన్...
గతేడాది మార్చిలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లిగీ జమాత్ సదస్సుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీం గురువారం విచారణ చేపట్టింది. ఓవైపు దేశమంతా లాక్ డౌన్లో ఉండగా మర్కజ్లో పెద్ద ఎత్తున జనం ఒకచోట చేరి జమాత్ నిర్వహించడాన్ని ఢిల్లీ పోలీసులు అడ్డుకోలేకపోయారని పిటిషనర్ ఆరోపించారు. నిజాముద్దీన్ చీఫ్ మౌలానా సాద్ను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని పిటిషన్లో పేర్కొన్నారు.
కోవిడ్ 19 మార్గదర్శకాలను పాటించాలి : సుప్రీం
పిటిషనర్ తరుపున కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది ఓం ప్రకాష్ పరిహార్... మౌలానా సాద్ ఎక్కడున్నాడన్న దానిపై ఇప్పటికీ కేంద్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదన్నారు. దీనిపై అభ్యంతరం తెలిపిన న్యాయస్థానం... ఎందుకని ఒక వ్యక్తి విషయంలో ఇంత ఆసక్తి ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించింది. మనం మాట్లాడుతున్నది కోవిడ్ 19 సమస్యపై అని... ఎందుకు దాన్ని వివాదాస్పదం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించింది. కోవిడ్ 19 మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని న్యాయస్థానం చెబుతోందని స్పష్టం చేసింది.
రైతుల నిరసన ప్రదేశాల్లో చర్యలపై ఆరా...
తబ్లిగీ జమాత్కు సంబంధించి కేంద్రం నుంచి కోర్టు వివరాలు అడిగింది. అలాగే ఢిల్లీలో రైతులు నిరసన చేస్తున్న చోట ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తూ కేంద్రానికి నోటీసు ఇచ్చింది. ప్రభుత్వం తరుపున కోర్టు ఎదుట హాజరైన సొలిసిటర్ జనరల్ మెహతా తబ్లిగీ జమాత్ ఘటనపై ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతోందన్నారు. రైతులకు సంబంధించి కోర్టు అడిగిన ప్రశ్నపై రెండు వారాల్లో రిప్లై పిటిషన్ దాఖలు చేస్తామన్నారు.
గతేడాది కలకలం రేపిన తబ్లిగీ జమాత్...
గతేడాది మార్చిలో వెలుగుచూసిన తబ్లిగీ జమాత్ దేశంలో కరోనా వ్యాప్తికి కారణమైందన్న ఆరోపణలున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి వివిధ దేశాలకు చెందిన ముస్లిం ప్రతినిధులతో పాటు దేశవ్యాప్తంగా తరలివచ్చిన ముస్లింలతో ఇక్కడ జమాత్ నిర్వహించారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం అప్పట్లో దేశంలో పెద్ద దుమారమే రేపింది. దేశంలో ఎక్కడ కరోనా కేసు బయటపడ్డ దానికి తబ్లిగితో లింకులు బయటపడటం తీవ్ర కలకలం రేపింది.