సీఎంకు ఎదురు దెబ్బ, ర్యాలీకి అనుమతి ఇచ్చిన సుప్రీం కోర్టు, శాంతిభద్రతలు మీరే కాపాడాలి !
చెన్నై/న్యూఢిల్లీ: షరతులతో ర్యాలీ నిర్వహించుకోవాలని, శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కల్పించకుండా ర్యాలీ నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ కు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి ఇవ్వకూడదని ఇంతకాలం వాదించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
తమిళనాడులో ఆర్ఎస్ఎస్ షరతులతో ర్యాలీని నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని గతేడాది సెప్టెంబర్ 22న మద్రాసు (చెన్నై) హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను తమిళనాడు పోలీసులు అమలు చేయలేదని ఆర్ఎస్ఎస్ కార్యకర్తల తరఫున న్యాయవాది కోర్టు ధిక్కార కేసు దాఖలు చేశారు.

ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి చుట్టుపక్కల గోడలున్న క్రీడా మైదానంలో మాత్రమే ర్యాలీ నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలపై ఆర్ఎస్ఎస్ తరఫున న్యాయవాదులు హైకోర్టులో మళ్లీ అప్పీలు చేశారు. ఈ అప్పీల్ను విచారించిన హైకోర్టు ఆర్ఎస్ఎస్ ర్యాలీని క్రీడా మైదానంలో నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.
ఆర్ఎస్ఎస్ బహిరంగంగా ర్యాలీ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు క్రమశిక్షణను పాటించాలని, ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ర్యాలీని శాంతియుతంగా నిర్వహించాలని హైకోర్టు సూచించింది. ర్యాలీ కోసం మూడు తేదీలను ఎంచుకుని పోలీసు విభాగానికి దరఖాస్తు చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ కు మద్రాసు హైకోర్టు చూసించింది.
ఆర్ఎస్ఎస్ ఎంపిక చేసిన మూడు తేదీల్లో ఏదోఒక తేదీన మీరు అనుమతి ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి ఇవ్వకూడదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టుకు మనవి చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ర్యాలీలు నిర్వహించడాన్ని అనుమతించలేమని తమిళనాడు ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీం కోర్టులో వాదించారు. శాంతిభద్రతలను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ విధి. దాని కోసం ఆర్ఎస్ఎస్ ర్యాలీని ఆపడం సరికాదని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వ వాదనను అంగీకరించరాదని ఆర్ఎస్ఎస్ న్యాయవాదులు సుప్రీం కోర్టులో వాదించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తమిళనాడులో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి షరతులతో అనుమతి ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. తమిళనాడులో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి ఇవ్వడంతో తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందని ఆ రాష్ట్రంలోని ఆర్ఎస్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు అంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పును ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు స్వాగతించారు.












Click it and Unblock the Notifications