సుప్రీం కోర్టులో నేటి నుంచి ‘అయోధ్య’ కేసుపై విచారణ...ఆ నేతలు ఏమంటున్నారంటే?
న్యూఢిల్లీ:సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న అత్యంత కీలకమైన అయోధ్య కేసుపై సుప్రీం కోర్టులో నేటి నుంచే విచారణ జరగనుంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానంలో ఈరోజు నుంచి వాదప్రతివాదనలు జరగనున్నాయి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కె.ఎం జోసెఫ్ లతో కూడిన బెంచ్ ముందుకు ఈ కేసు విచారణకు రానున్నది. ఇటీవల వరుసగా ఆధార్ చట్టబద్ధత, స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాలు, శబరిమలలో మహిళల ప్రవేశం వంటి కేసుల్లో వరుస కీలక తీర్పులు ఇచ్చిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈసారి అయోధ్య కేసును కూడా తేల్చేస్తుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయోధ్య కేసు విచారణ...నేటి నుంచే
అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు ప్రాంతంలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రాంలల్లా, సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మొహీ అఖాడా మధ్య పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలు కాగా సోమవారం నుంచి వీటిపై వాదప్రతివాదనలు జరగనున్న నేపథ్యంలో దేశంలోని ప్రముఖ హిందూ, రాజకీయ నేతలు, సంస్థలు ఈ కేసు విషయమై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ ఎస్ఎస్ ఛీఫ్...ఇలా అన్నారు
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ విజయదశమి సందర్భంగా నాగపూర్లో చేసిన వార్షిక ప్రసంగంలో...న్యాయమూర్తులు సంప్రదాయాల్ని, భారతీయ కుటుంబ వ్యవస్థనూ దృష్టిలో ఉంచుకుని తీర్పులు ఇవ్వాలని, రామ మందిరాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ఒక చట్టం చేయాలని అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. తాము తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పటికీ రామమందిరాన్ని ఎందుకు నిర్మించకూడదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రముఖుల...అభిప్రాయాలు
కేంద్ర మంత్రి గిరిరాజ్ఇటీవల మాట్లాడుతూ అయోధ్య విషయంపై ప్రజల సహనం రోజురోజుకూ తగ్గిపోతోందని...సుప్రీం కోర్టు త్వరలో ఈ కేసును పరిష్కరించాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రామమందిర నిర్మాణానికి చట్టం చేయాలని విశ్వహిందూపరిషత్ ఉన్నతాధికార కమిటీ కూడా తీర్మానించింది. ఇక అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించి తీరుతామని బీజేపీ ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది.

యోగి ఆదిత్యనాథ్...ఏమన్నారంటే
అయోధ్య కేసుపై విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ విషయమై స్పందించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు...రామమందిరం విషయంలో కూడా వీలైనంత త్వరగా తీర్పు ఇవ్వాలని, వివక్ష ఉండకూడదని అన్నారు. రామజన్మభూమి రాజకీయాలకు సంబంధించిన అంశం కాదని.. మతవిశ్వాసాలకు సంబంధించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆయన తేల్చేస్తారు...అంటున్నారు
ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ కేసులను అత్యంత వేగంగా పరిష్కరించేందుకు ప్రాధాన్యతనిస్తారని, ఏ కేసునూ పెండింగ్లో పెట్టడాన్ని ఆయన అంగీకరించబోరని న్యాయవర్గాలు వెల్లడిస్తుండటం గమనార్హం. అయితే భారత లౌకికతత్వం, మెజారిటీ ప్రజలు మనోభావాలతో ముడిపడివున్న ఈ కేసులో తీర్పు దేశరాజకీయాలను ఏ విధంగా...ఎంతమేర ప్రభావం చూపుతుందోనని సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications