లైంగిక దాడుల కేసుల విచారణలో ఇకపై ఈ గైడ్లైన్స్ తప్పనిసరి... అలాంటి వ్యాఖ్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు లేదు
ఇటీవలి కాలంలో మహిళలు,చిన్నారులపై లైంగిక దాడుల కేసులకు సంబంధించి న్యాయస్థానాలు ఇచ్చిన కొన్ని తీర్పులు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాంబే హైకోర్టు ఈ ఏడాది ఇచ్చిన రెండు తీర్పులు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దుస్తుల పైనుంచి బాలిక స్తనాలను తాకినంత మాత్రాన పోక్సో చట్టం కింద లైంగిక దాడిగా పరిగణించలేమని... ఒక చేత్తో బాలిక చేయి పట్టుకుని,మరో చేత్తో ప్యాంట్ జిప్ ఓపెన్ చేసినంత మాత్రాన దాన్ని కూడా పోక్సో చట్టం కింద లైంగిక దాడిగా పరిగణించలేమని రెండు వేర్వేరు కేసుల్లో బాంబే హైకోర్టు తీర్పులిచ్చింది.
గతేడాది మధ్యప్రదేశ్ కోర్టు ఓ లైంగిక దాడి కేసులో నిందితుడికి 'రాఖీ' కండిషన్పై బెయిల్ మంజూరు చేసింది. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెతో రాఖీ కట్టించుకుంటేనే బెయిల్ ఇస్తామని పేర్కొంది. ఈ తీర్పు విషయంలో తాజాగా సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదొక్కటే కాదు మహిళలపై లైంగిక దాడుల కేసుల విచారణలో న్యాయమూర్తులు,న్యాయవాదులు సున్నితత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అంతేకాదు,లైంగిక దాడుల కేసుల విచారణలో ఎలా వ్యవహరించాలో చెప్తూ కొన్ని కచ్చితమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
'న్యాయమూర్తులు అన్ని దశల్లో చాలా కీలక పాత్ర పోషిస్తారు... టీచర్లు,మేదోవర్గం నాయకుల్లాగా.. కాబట్టి మాటల్లోనూ,చేతల్లోనూ అన్ని సందర్భాల్లో వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఒకవేళ వారు అలా వ్యవహరించకపోతే బాధితులకు దారుణమైన కౄరత్వాన్ని కలిగించినవారవుతారు.' అని సుప్రీం కోర్టు పేర్కొంది. లైంగిక దాడులకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలతో పాటు న్యాయమూర్తులు,న్యాయవాదులకు లింగ సున్నితత్వంపై శిక్షణా మాడ్యూల్స్ రూపొందించాలని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ నేత్రుత్వంలోని సుప్రీం బెంచ్ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ (ఎన్జేఏ),బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బిసిఐ)ను కోరింది.
లైంగిక దాడుల కేసుల విచారణలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు-సుప్రీంకోర్టు :
బెయిల్ షరతుల్లో నిందితుడికి,బాధితురాలికి మధ్య సంబంధాన్ని తప్పనిసరి చేయకూడదు. అలాగైతేనే ఫిర్యాదుదారుకి నిందితుల నుంచి ఎదురయ్యే వేధింపుల నుంచి రక్షణ దొరుకుతుంది.
ఒకవేళ బాధితురాలికి నిందితుడి నుంచి హాని పొంచి ఉందని కోర్టు భావిస్తే... లేదా పోలీస్ నివేదికలో ఆ విషయంలో వెల్లడైతే... అప్పుడు బాధితురాలికి కల్పించాల్సిన రక్షణపై ప్రత్యేక జాగ్రత్త తీసుకుని... అందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడు బాధితురాలిని సంప్రదించే,కలుసుకునే,ఇతరత్రా ఎలాంటి సంబంధం లేకుండా ఆదేశాలివ్వాలి.
లైంగిక దాడి కేసుల్లో నిందితుడికి బెయిల్ వచ్చిన వెంటనే... కేసు పెట్టిన మహిళకు వెంటనే ఆ సమాచారమివ్వాలి. రెండు రోజుల్లో ఆ బెయిల్ ఆర్డర్ కాపీని వారికి అందించాలి.
లైంగిక దాడి కేసుల్లో ఉత్తర్వులు,బెయిల్ పితృస్వామ్య భావనలను ప్రతిబింబించకూడదు. తప్పనిసరిగా సీఆర్పీసీ నిబంధనలకు అనుగుణంగానే ఆ ఉత్తర్వులు ఉండాలి. మరో రకంగా చెప్పాలంటే... దుస్తులు,ప్రవర్తన,నైతికత వంటి అంశాలను ప్రాసిక్యూటర్ బెయిల్ విషయంలో ప్రస్తావించరాదు.
లింగ సంబంధిత నేరాల్లో తీర్పులు చెప్పేటప్పుడు.. బాధితులతో నిందితుల వివాహం లేదా ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వాన్ని,రాజీ ధోరణిని సూచించడం వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు,సూచించకూడదు.
న్యాయమూర్తులు అన్నివేళలా సున్నితత్వాన్ని ప్రదర్శించాలి.అలాగే బాధితుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పదాలను ఉపయోగించకూడదు. అలాంటి విషయాలు కోర్టు పట్ల బాధితుల్లో నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తాయి.
మహిళలు భౌతికంగా బలహీనులు వారికి రక్షణ అవసరం,మహిళలకు శక్తి సామర్థ్యం తక్కువ... వారు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు,పురుషులే ఇంటికి యజమానులు.. కాబట్టి కుటుంబ నిర్ణయాలన్నీ వారే తీసుకోవాలి,మన సంస్కృతీ సంప్రాదాయాల ప్రకారం మహిళలు అణిగిమణిగి ఉండాలి,రాత్రిపూట ఒంటరిగా వెళ్లినందుకే లేదా అలాంటి దుస్తుల వల్లే దాడి జరిగింది.. ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని సుప్రీం స్పష్టం చేసింది.