సుప్రీం జడ్జి చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు-ప్రభుత్వాల్ని జవాబుదారీగా మార్చాల్సింది మేథావులే
భారత్ లో ప్రభుత్వాల పాత్రపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాల తప్పులు బయటపెట్టాల్సింది, తప్పుడు వార్తలు, నకిలీ వార్తల్ని అడ్డుకోవాల్సింది మేథావులే అని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో భారత దేశ ఆరో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగ్లా స్మారక ఉపన్యాసం చేసిన జస్టిస్ చంద్రచూడ్... దేశంలో తాజా పరిస్దితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పనిచేసేలా, తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు రాకుండా చూసేలా మేథావులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రభుత్వాలపై అతిగా ఆధారపడకూడదని కూడా చంద్రచూడ్ తెలిపారు. ఇందుకు తాజాగా కోవిడ్ సందర్భంగా వచ్చిన పలు నకిలీ వార్తలు, విశ్లేషణలు, వివరాలను ఆయన గుర్తు చేశారు.
నిరంకుశ ప్రభుత్వాలు తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం అబద్ధాలపై నిరంతరం ఆధారపడతాయని, ఈ క్రమంలో చాా తప్పిదాలు చోటు చేసుకుంటాయని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. తాజాగా కోవిడ్ సందర్భంగా వివిధ ప్రభుత్వాలు వ్యవహరించిన తీరును ఆయన ఓసారి గుర్తు చేసుకున్నారు. భారత్ లో కోవిడ్ ప్రభావం తక్కువ చేసి చూపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాయంటూ మేథావులు, జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్ధల నుంచి విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో చంద్రచూడ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Recommended Video
సమాజంలో ఫేక్ న్యూస్ పెరుగుతోందని, అయితే జనం తమ స్వభావం రీత్యా సంచలనాలకు ప్రభావితం అవుతారని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. కరోనా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఫేక్ న్యూస్ కు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఇన్ఫోడెమిక్ గా పేరు పెట్టిన విషయాన్ని చంద్రచూడ్ గుర్తు చేశారు. మరోవైపు నకిలీ ప్రచారాలకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ట్విట్టర్, ఫేస్ బుక్ వంటివి వేదికలుగా మారుతున్నాయని కూడా చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భిన్నాభిప్రాయాల్ని ఆమోదించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రజలు ఎక్కువగా న్యూస్ పేపర్లపై ఆధారపడుతున్నారని, కానీ మేథావులు రచించిన రచనల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని చంద్రచూడ్ తెలిపారు.