సంగీత సామ్రాజ్యానికి రారాజులా.: ఎస్పీ బాలు మృతిపై సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన
న్యూఢిల్లీ: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం దేశ సంగీత ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టింది. ఆయన మరణం అనేక మంది హృదయాలను కలచివేసింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు బాలు మృతికి ఆవేదనకు గురయ్యారు. ఒక సంగీత దిగ్గజం నెలకొరిగిందంటూ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

తెలుగు జాతికి తీరని లోటు..
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ రమణ.. ఎస్పీ బాలు మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన అమృతగానంతో తెలుగు భాష, సాహిత్యం చరిత్రలను సజీవంగా ఉంచడమే కాకుండా, ప్రజ్వరిల్లంపజేసిన మహనీయుడు అని కొనియాడారు. బాలు మరణం తెలుగు భాషకు, జాతికి తీరని లోటని అన్నారు.

సంగీత సామ్రాజ్యానికి రారాజులా..
సుస్వర మాధుర్యంతో యావత్ ప్రపంచాన్ని ఆనందసాగరంలో ఓలలాడించిన గొప్ప మనిషి ఎస్పీ బాలు అని జస్టిస్ ఎన్.వీ రమణ ప్రశంసించారు. తన అమరగానంతో తెలుగు భాషలోనే గాక, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానాన్ని గెలుచుకున్నారన్నారు. యావత్ సంగీత సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా ఏలిన జైత్రయాత్రికుడు ఎస్పీ బాలు అని కొనియాడారు.

తెలుగువారి గుండెల్లో.. తెలుగుతల్లికి గర్భశోకం..
తెలుగుజాతి ఉన్నంత వరకు అందరి హృదయాల్లో బాలసుబ్రహ్మణ్యం ఉంటారని అన్నారు. బాలు మరణం తెలుగుతల్లికి గర్భశోకమని వ్యాఖ్యానించారు. తెలుగువారంతా బాలు కుటుంబసభ్యులేనని అన్నారు. అందుకే బాలును కోల్పోయి కుమిలిపోతున్న వారి కుటుంబసభ్యులతోపాటు యావత్ సంగీత అభిమానులందరికీ జస్టిస్ ఎన్.వీ రమణ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బాలు గొంతు అమరం అంటూ రాహుల్ గాంధీ..
జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ ఎస్పీ బాలు మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త హృదయాన్ని కలిచివేసిందని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ.. బాలు మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాలు పాటలు లక్షలాది మంది మనసులను తాకాయని, ఆయన గొంతు ఎప్పటికీ అమరంగా ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications