లాక్డౌన్పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు... ఆక్సిజన్ సప్లై,కరోనా చర్యలపై కీలక ఆదేశాలు
ఢిల్లీలో ఆక్సిజన్ కొరతను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 3 లేదా ఆరోజు అర్థరాత్రి కంటే ముందే సమస్యను పరిష్కరించాలని సూచించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎమర్జెన్సీ వినియోగం కోసం ఆక్సిజన్ నిల్వలు ఏర్పాటు చేసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.'ఇప్పటికే రాష్ట్రాలకు కేటాయించిన ఆక్సిజన్తో పాటు రాబోయే 4 రోజుల్లో ఎమర్జెన్సీ వినియోగానికి ఆక్సిజన్ నిల్వలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే రోజువారీ ప్రాతిపదికన వాటిని పర్యవేక్షించాలి.' అని సుప్రీం కోర్టు కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
జాతీయ విధానాన్ని రూపొందించండి : సుప్రీం కోర్టు
సోషల్ మీడియాలో సమాచారాన్ని నియంత్రించడం లేదా ఏ ప్లాట్ఫామ్ ద్వారానైనా సహాయం కోరే వ్యక్తులకు వేధింపులు ఎదురవడం వంటి అంశాలను న్యాయస్థానం తీవ్రంగా పరిగణిస్తుందని సుప్రీం స్పష్టం చేసింది. ఈ విషయాన్నికేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చీఫ్ సెక్రటరీలు,డీజీపీ,సీపీలకు నోటీఫై చేయాలని ఆదేశించింది. ఆస్పత్రుల్లో అడ్మిషన్లకు సంబంధించి రెండు వారాల్లోగా జాతీయ విధానాన్ని రూపొందించాలని... రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దాన్ని పాటించాలని ఆదేశించింది. అప్పటివరకూ దేశవ్యాప్తంగా ఏ ఆస్పత్రిలోనూ స్థానికత ఆధారంగా ఏ పేషెంట్కు వైద్యం నిరాకరించరాదని ఆదేశించింది. ఇప్పటికే ఉన్న ఆక్సిజన్ నిల్వలు,వ్యాక్సిన్లు,వాటి ధరలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి పున:సమీక్ష జరపాలని పేర్కొంది.
లాక్డౌన్పై కీలక వ్యాఖ్యలు...
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యలు,జాగ్రత్తలు,భవిష్యత్ ప్రణాళికలు ప్రతీ ఒక్కటి రికార్డు చేయబడాల్సిందేనని తెలిపింది.భారీగా జనం గుమిగూడే సమావేశాలు,ఇతరత్రా ఈవెంట్లపై నిషేధం విధించే విషయాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా పరిగణించాలని విజ్ఞప్తి చేసింది. ప్రజల జీవితాలను దృష్టిలో ఉంచుకుని లాక్డౌన్ విధించే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. అదే సమయంలో లాక్డౌన్ వల్ల పేదలపై సామాజిక,ఆర్థిక ప్రభావం ఎక్కువగా ఉంటోందని... కాబట్టి లాక్డౌన్ విధించాల్సి వస్తే... వారికోసం అవసరమైన ఏర్పాట్లు ముందే చేయాలని సుప్రీం సూచించింది.
అవసరమైతే వాళ్లనూ ఉపయోగించుకోండి...
అవసరమైతే కేంద్ర భద్రతా బలగాలకు సేవలందించే హెల్త్ కేర్ సిబ్బందిని కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ సేవలకు వినియోగించుకోవాలని సూచించింది. కరోనా సమయంలో రెమ్డిసివిర్,టోసిలిజుమాబ్ వంటి డ్రగ్స్ను అధిక ధరలకు విక్రయించడం లేదా నకిలీ డ్రగ్స్ విక్రయించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్న వేళ ఇలాంటి చర్యలు వారిని మరింత దోపిడీ చేయడమేనని అభిప్రాయపడింది.