క్రైస్తవులపై యథేచ్ఛగా దాడులు: నెలరోజుల్లో 57 కేసులు: సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: దేశంలో క్రైస్తవ సామాజిక వర్గ ప్రజలపై యథేచ్ఛగా దాడులు కొనసాగుతున్నాయని, వాటిని అడ్డుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలైంది. బెంగళూరు ఆర్చ్బిషప్ డాక్టర్ పీటర్ మచాడో, ఎవాంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా, నేషనల్ సాలిడారిటీ ఫోరం ఈ పిటీషన్ను వేశాయి. వారి తరఫున సీనియర్ అడ్వొకేట్ డాక్టర్ కొలిన్ గొన్జాల్వేజ్ ఈ పిటీషన్ వేశారు.
దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జులై 11వ తేదీన లిస్టింగ్ చేసింది. నెలరోజుల వ్యవధిలో 57 ఘటనలు నమోదయ్యాయని పిటీషన్దారు పేర్కొన్నారు. అత్యవసర పిటీషన్గా దీన్ని స్వీకరించి, విచారణ చేపట్టాలంటూ పిటీషన్దారు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఈ పిటీషన్పై విచారణను జులై 11వ తేదీకి లిస్టింగ్ చేసింది.
దేశవ్యాప్తంగా నెలరోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో 57 దాడలు చోటు చేసుకున్నాయని కొలిన్ గొన్జాల్వేజ్ చెప్పారు. సగటున ప్రతి రోజూ రెండు దాడుల ఘటనలు నమోదయ్యాయని అన్నారు. ఇది క్రైస్తవ సామాజిక వర్గాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని ఈ పిటీషన్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు వెకేషన్ కాలం ముగిసే సమయానికి ఈ దాడుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని చెప్పారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు.
వెకేషన్ కాలం ముగిసిన మరుసటి రోజే లిస్టింగ్ చేశామని అన్నారు. అత్యవసర పిటీషన్గా విచారించాలనే విషయంపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని, వెకేషన్ గడువు ముగిసిన రోజే లిస్టింగ్ చేశామని పిటీషన్దారుకు చెప్పారు. కాగా ఇదివరకే ఈ పిటీషన్ సుప్రీంకోర్టు గడప తొక్కింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారించలేమని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అర్జెన్సీ లేదని, బెంచ్కు రెఫర్ చేసినట్లు చెప్పారు.
పలు రాష్ట్రాల్లో క్రైస్తవులను దాడులు కొనసాగుతున్నాయని కొలిన్ గొన్జాల్వేజ్ ఆందోళన వ్యక్తం చేశారు. వాటిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్తో దర్యాప్తు జరిపించాలంటూ డిమాండ్ చేశారు. చర్చ్లల్లో ప్రార్థనలు సాగుతున్న సమయంలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తోన్నారని చెప్పారు. క్రైస్తవ ప్రార్థన మందిరాలకు పోలీసుల భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.