కాంగ్రెస్ కు భారీ దెబ్బ, తమిళనాడుకు కావేరీ నీరు ఇవ్వాలి: సుప్రీం కోర్టు, కేంద్రానికి డెడ్ లైన్!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇరుకునపడింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో తమిళనాడుకు కచ్చితంగా కావేరీ నీరు విడుదల చేయాల్సి వచ్చింది. కావేరీ నీరు కచ్చితంగా విడుదల చేస్తే బెంగళూరు, మండ్య, మైసూరులో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.
సుప్రీం కోర్టు ఆదేశం
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తమిళనాడు ప్రభుత్వం సమర్పించిన అర్జీని విచారణ చేసింది. అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసం వెంటనే తమిళనాడుకు 4 టీఎంసీల కావేరీ నీరు విడుదల చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. నీరు విడుదల చెయ్యకపోతే తీవ్రపరిణాయాలు ఎదుర్కోవాల్సి వస్తోందని కర్ణాటకను సుప్రీం కోర్టు హెచ్చరించింది.
కేంద్రానికి ఆదేశాలు
కావేరీ నీరు పంపిణి విషయంలో, కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం మీద సుప్రీం కోర్టు మండిపడింది. కావేరీ నీటి పంపిణి విషయంలో, కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
శాసన సభ ఎన్నికలు
కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయని, ఎన్నికలు పూర్తి అయిన తరువాత కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీం కోర్టులో మనవి చేశారు.
కేంద్రానికి నోచాన్స్
కార్ణాటక శాసన సభ ఎన్నికలు పూర్తి అయిన తరువాత కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. 10 రోజుల్లో కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
కావేరీ నీరు ఎంత ఉంది
కర్ణాటక తమిళనాడుకు ఎన్ని టీఎంసీల కావేరీ నీరు విడుదల చేసింది, కర్ణాటకలోని జలాశయాల్లో ఎన్ని టీఎంసీల నీరు ఉంది అనే పూర్తి సమాచారంతో వచ్చే మంగళవారం లోపు అఫిడవిట్ సమర్పించాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు కేసు విచారణ మే 8వ తేదీ మంగళవారంకు వాయిదా వేసింది.
ఎన్నికల్లో భారీ దెబ్బ ?
సుప్రీం కోర్టు ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం పాటించాల్సి ఉంది. అదే సమయంలో కావేరీ నీరు వదిలితే బెంగళూరు నగర ప్రజలతో పాటు మండ్య, మైసూరు జిల్లా రైతులు ఎన్నికల్లో సినిమా చూపిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
తమిళనాడు రైతులు
తమిళనాడుకు నాలుగు టీఎంసీల నీరు విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చెయ్యడంతో ఆ రాష్ట్రంలోని డెల్టా ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడుకు కావేరీ నీరు వదిలితే వేసవి కాలంలో తాము తాగునీరుకు ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తోందని బెంగళూరు నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.