తమిళనాడు ప్రభుత్వానికి చివాట్లు పెట్టిన సుప్రీం కోర్టు: నోటీసులు జారీ !
తమిళనాడు రైతుల ఆందోళనకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీం కోర్టు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తూ అన్నదాతల ఆత్మహత్యలపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఎడప్పాడి పళనిసామి
న్యూఢిల్లీ: తమిళనాడు రైతుల ఆందోళనకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీం కోర్టు తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై రెండు వారాల్లో పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని గురువారం సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అన్నదాతల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు ఇటువంటి సమయాల్లో తమిళనాడు ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదని వ్యాఖ్యానించింది. రైతుల పట్ల తమిళనాడు ప్రభుత్వం మానవతాదృక్పదంతో స్పందించాలని సుప్రీం కోర్టు సూచించింది.
రైతులు అంటే చులకనా ?
నెల రోజులుగా రుణమాఫీ చెయ్యాలని, కరువు ఉపశమన ప్యాకేజీలు మంజూరు చెయ్యాలని తమిళనాడు రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు తీర్చాలని ప్రతిరోజూ వినూత్న రీతిలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసనలు చేపడుతున్నారు.
అరగుండుతో నిరసన
గురువారం జంతర్ మంతర్ దగ్గర తమిళనాడు రైతులు అరగుండ్లతో నిరసన వ్యక్తం చేస్తూ రుణమాఫీపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ నినాదాలు చేశారు. మా డిమాండ్లు నేరవేర్చకుంటే గొంతులు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.
వినూత్న రీతిలో పుర్రెలు, ఎముకలు
గత నెల రోజుల నుంచి పుర్రెలు, ఎముకలు, ఎలుకలతో ఆందోళన చేస్తూ చెట్లు ఎక్కి నిరసన వ్యక్తం చేసిన తమిళనాడు రైతులు భారతదేశం దృష్టిని ఆకర్షించారు. కేంద్ర ప్రభుత్వానికి తమ ఆక్రందనను వినిపించేందుకు ప్రతిరోజూ వినూత్న రీతిలో జంతర్ మంతర్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం నిధులు స్వాహానా ? లేక
రైతుల ఆందోళన నేపథ్యంలో కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం రూ. 2,014 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందులో ఎన్ని కోట్ల రూపాయలతో రైతులను ఆదుకున్నారు అనే విషయం తమిళనాడు ప్రభుత్వం బహిరంగం చెయ్యాల్సి ఉంది.
సుప్రీం కోర్టుకు ఏం చెబుతారు ?
రైతుల ఆత్మహత్యలు, వారిని ఆదుకోవడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి సమాచారం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం ఇప్పుడు చిక్కుల్లో పడిందని సమాచారం. సుప్రీం కోర్టుకు ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి నివేదిక ఇస్తుందో వేచిచూడాలపి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.