వాట్సప్పై నిషేధం విధించలేం: 'కేంద్రాన్ని సంప్రదించు'
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక మంది వినియోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్పై నిషేధం విధించాలంటూ వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని పిటిషనర్కు సుప్రీం కోర్టు సూచించింది.
వివరాల్లోకి వెళితే... వాట్సప్ లాంటి యాప్ను ఉపయోగించడం ద్వారా నేరాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే దానిపై నిషేధం విధించాలని హర్యానాకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త సుధీర్ యాదవ్ ఇటీవలే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో ప్రముఖ మెసేజింగ్ యాప్లైన వాట్సప్, వైబర్, టెల్గ్రామ్, హైక్ల సాయంతో ఉగ్రవాదులు, నేరస్తులు కోడ్ మేసేజ్లను పంపుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారంటూ పేర్కొన్నారు.
అంతేకాదు ఇలాంటి కోడ్ మెసేజ్లను చేధించడం దర్యాప్తు సంస్థలకు చాలా కష్టమైన పని అని యాదవ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. సూపర్ కంప్యూటర్లు కూడా కోడ్ మేసేజ్లను చేధించలేవని యాదవ్ పేర్కొన్నారు. 256 బిట్ ఎన్క్రిప్టెడ్ సందేశాన్ని చేధించడానికి సుమారు వందేళ్ల సమయం పడుతుందని యాదవ్ పేర్కొన్నారు.
కాబట్టి ఈ యాప్ల వల్ల దేశ భద్రతకు భంగం కలుగుతుందని, తక్షణమే వాటిపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ విషయంపై టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అపల్లేట్ ట్రిబ్యూనల్ను(టీడీఎస్ఏటీ) సంప్రదించాలని యాదవ్కు సూచించింది.