నేరస్తుల ఇళ్ల కూల్చివేతలను ఆపలేం కానీ, చట్టం ప్రకారమే..: యూపీకి సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వివిధ నేరాల్లో, హింసాత్మక ఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసే విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే కచ్చితంగా చట్టంలోని నియమాలు, నిబంధనలను అనుసరించే అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరగాలని స్పష్టం చేసింది. ఈ విషయంపై మూడు రోజుల్లోగా స్పందన తెలపాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని, అధికారులను ఆదేశించింది.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చెలరేగిన అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లను ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేస్తోంది. అయితే, ఇది చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన అత్యున్నత ధర్మాసనం మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని అదేశించింది.కాగా, "చట్టవిరుద్ధమైన" ఇళ్ల కూల్చివేతకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జమియత్ ఉలమా-ఇ-హింద్ అనే సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మహమ్మద్ ప్రవక్తపై ఇద్దరు బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల్లో పాల్గొన్నారని ఆరోపించిన నిందితుల ఆస్తులను యూపీ ఇటీవల కూల్చివేసింది. కాన్పూర్, ప్రయాగ్రాజ్, సహరాన్పూర్లో కూల్చివేసిన ఇళ్లు హింసాత్మక ఘటనలకు పాల్పడిన నిందితులకు చెందినవి.కూల్చివేతలు "షాకింగ్, భయంకరమైనవి" అని పిటిషనర్లు సుప్రీంకోర్టుకు తెలిపారు, ఇళ్లను ధ్వంసం చేసిన తర్వాత నోటీసులు అందించారని ఆరోపించారు.
"తగినంత ముందు నోటీసులు తప్పనిసరి. చేస్తున్నది రాజ్యాంగ విరుద్ధం, దిగ్భ్రాంతికరమైనది. ఇది ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్నారు' అని పిటిషనర్ల తరఫు న్యాయవాది సియు సింగ్ ఆరోపించారు. యూపీ చట్టాల ప్రకారం కూల్చివేతలకు కనీసం 15 నుంచి 40 రోజుల నోటీసు తప్పనిసరి అని ఆయన అన్నారు.