UGC NET పరీక్షల వాయిదాపై సుప్రీంకోర్టు సంచలనం
UGC-NET Examination 2024: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కొద్దిరోజుల కిందట దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. గుజరాత్లో 10 లక్షల రూపాయలకు నీట్ పరీక్ష పేపర్లను అమ్ముకున్నారంటూ వార్తలు రావడం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, 1,563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు కలపడం వంటి వివాదాలు నీట్ పరీక్షలను చుట్టుముట్టాయి.
ఆ గందరగోళ పరిస్థితుల మధ్య నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అప్పట్లో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. జూన్ 18వ తేదీన జరగాల్సిన యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ను ఆగస్టు 21వ తేదీకి వాయిదా వేసింది. అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు వివరించింది. యూజీసీ- నెట్ పరీక్షలు వాయిదా పడటానికి ప్రధాన కారణం పేపర్ లీక్ అయినట్లు వార్తలు రావడమే అనేది బహిరంగ రహస్యం.

అప్పట్లో ఈ పరీక్షలను వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ పిటీషన్లను దాఖలు చేశారు. వేర్వేరుగా 45కు పైగా పిటీషన్లు దాఖలయ్యాయి.
వాటిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు తాజాగా తన నిర్ణయాన్ని వెల్లడించింది. యూజీసీ- నెట్ పరీక్షను రద్దు చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేమని స్పష్టం చేసింది. అలా చేస్తే తీవ్ర గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని వ్యాఖ్యానించింది.
ఈ పిటీషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మధ్యాహ్నం తన అభిప్రాయాలను వెల్లడించింది. ఈ నెల 21వ తేదీన యూజీసీ- నెట్ పరీక్షలు జరుగబోతున్నాయని, తొమ్మిది లక్షలమందికి పైగా అభ్యర్థులు వాటిని రాయబోతోన్నారని వివరించింది.
పరీక్షల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడం సరికాదని బెంచ్ వ్యాఖ్యానించింది. పరీక్షలను నిర్వహించడంలో ఇప్పటికే రెండు నెలలు దాటిపోయాయని, ఇప్పుడు మళ్లీ అందులో జోక్యం చేసుకుంటే లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications