సుప్రీంలో "మహా" పంచాయితీ: ముగిసిన వాదనలు, ఫడ్నవీస్కు ఊరట, తీర్పు రిజర్వ్
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పును మంగళవారం ఉదయం 10:30 గంటలకు వాయిదా వేసింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన వాదనలు సోమవారం కూడా కొనసాగాయి. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలను వినింది. ఇరువర్గాల తరపున లాయర్లు కోర్టులో తమ వాదనలు వినిపించారు.
సోమవారమే బలనిరూపణకు అంగీకరించని కోర్టు
మహారాష్ట్ర రాజకీయాలపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ పార్టీలు వేసిన పిటిషన్పై ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం మంగళవారంకు తీర్పును రిజర్వ్ చేసింది. సీఎం ఫడ్నవీస్ సోమవారం లేదా మంగళవారం బలనిరూపణ చేసుకోవాలని ఆమేరకు ఆదేశాలు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానంను కోరారు ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ. అయితే గవర్నర్ 14 రోజుల సమయం ఇచ్చారని బీజేపీ తరపున వాదించిన లాయర్ ముఖుల్ రోహిత్గీ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో బలనిరూపణపై సింఘ్వీ అభ్యర్థనను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. అంతకు ముందు తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని మహా వికాస్ అగాఢీ గవర్నర్ కార్యాలయంకు లేఖను సమర్పించింది.
సీఎం ఫడ్నవీస్కు ఊరట
బలనిరూపణపై మహా వికాస్ అగాఢీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో సీఎం ఫడ్నవీస్కు ఊరట లభించినట్లయ్యింది. ఇక 154 మంది ఎమ్మెల్యేలు సంతకం చేసిన అఫిడవిట్లను న్యాయస్థానంకు సమర్పించగా అఫిడవిట్లను పరిశీలించేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. ఒరిజినల్ పిటిషన్ మరింత పొడిగించొద్దని చెప్పడంతో అఫిడవిట్లను అభిషేక్ సింఘ్వీ ఉపసంహరించుకున్నారు. కవరింగ్ లెటర్ లేకుండానే గవర్నర్కు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను బీజేపీ అజిత్ పవార్లు సమర్పించారని ఇది ప్రజాస్వామ్యంను మోసగిస్తున్నట్లే అని అభిషేక్ సింఘ్వీ చెప్పారు. వెంటనే బలనిరూపణకు ఆదేశాలు ఇవ్వాలంటూ వాదించారు.
మోసం ఎక్కడుందని ప్రశ్నించిన ముకుల్ రోహత్గీ
బీజేపీ ఫడ్నవీస్ తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ... ఎన్సీపీ నేత అజిత్ పవార్ 53 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను ఫడ్నవీస్కు చూపించి తనతో చేతులు కలపాల్సిందిగా కోరినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఇద్దరూ కలిసి గవర్నర్ను కలవగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ కోరినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బలనిరూపణ చేసుకునేందుకు కాస్త గడువును కూడా గవర్నర్ ఇచ్చినట్లు రోహత్గీ కోర్టుకు తెలిపారు. ఇదే విషయాన్ని లేఖ ద్వారా తెలిపారని.. ఇందులో మహా వికాస్ అగాఢీ ఆరోపిస్తున్నట్లుగా మోసం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.
బలనిరూపణ విషయంలో కోర్టు జోక్యం ఉండదన్న రోహత్గీ
గవర్నర్ రాజ్యాంగంను అనుసరించే వ్యవహరిస్తారని చెప్పిన రోహత్గీ... బలనిరూపణకు కోర్టు జోక్యం ఉండదని చెప్పారు. మరోవైపు అసెంబ్లీలో జరిగే ప్రొసీడింగ్స్ను కోర్టు పర్యవేక్షించదనే విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు తుషార్ మెహతా. అదేసమయంలో గవర్నర్ నిర్ణయాలను నిర్ణయాధికారాలను కోర్టులు రివ్యూ చేయలేవని ముకుల్ రోహత్గీ తెలిపారు.
20 రోజులు ఆగిన గవర్నర్ 24 గంటలు ఆగలేకపోయారా..?
ఇక మహా వికాస్ అగాఢీ తరపున వాదించిన లాయర్ కపిల్ సిబాల్, 20 రోజుల పాటు ఆగిన గవర్నర్ మరో 24 గంటలు ఆగలేకపోయారా అని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎలా ఎత్తివేస్తారని ప్రశ్నించారు. అయితే అజిత్ పవార్ ఇచ్చిన లేఖపై మాట్లాడాల్సిందిగా కోరింది ధర్మాసనం. అయితే తాము మద్దతు ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖ తనవద్ద ఉందని కపిల్ సిబాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి అడ్డు చెప్పిన సాల్సిటర్ జనరల్ తుషార్ మెహతాకు సమాధానం చెప్పారు కపిల్ సిబాల్. అజిత్ పవార్ పార్టీపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారం లేదని చెబుతూ సంతకాలు చేసిన లేఖను అఫిడవిట్కు అటాచ్ చేస్తున్నామని కపిల్ సిబాల్ చెప్పారు. వెంటనే సీనియర్ ఎమ్మెల్యేని ప్రొటెం స్పీకర్గా పెట్టి బలనిరూపణ చేసుకోవాలని సిబల్ చెప్పారు.
తప్పులు కప్పిపుచ్చుకునే కొద్దీ మరిన్ని మోసాలు బయటపడతాయి
ఈ వాదనల తర్వాత మహా వికాస్ అగాఢీ తరపున వాదించిన అభిషేక్ సింఘ్వీ... తప్పులు కప్పిపుచ్చుకొనే కొద్దీ మరిన్ని మోసాలు బయటపడుతాయని చెప్పారు. వెంటనే ఫ్లోర్ టెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు అభిషేక్ సింఘ్వీ. అయితే ఇందకు కోర్టు అంగీకరించలేదు. మహావికాస్ అగాఢీ బలనిరూపణకు అడిగి విఫలమైనప్పటికీ బీజేపీ మాత్రం ఇప్పుడప్పుడే బలనిరూపణ వద్దంటోందని దీన్ని బట్టి చూస్తే బలనిరూపణకు కావాల్సిన సంఖ్యాబలం లేదని తెలుస్తోందన్నారు. ఇక ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఉదయం 10:30 గంటలకు తీర్పును రిజర్వ్ చేసింది.