సావర్కర్ కాదు.. మహాత్మా గాంధీ కూడా..! రాహుల్కు సుప్రీం మందలింపు
స్వాతంత్ర్య సమరయోధుడు వీడీ సావర్కర్పై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. స్వాతంత్య్ర సమరయోధుల పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా? అని మండిపడింది. స్వాతంత్య్ర సమరయోధుల గురించి బాధ్యతారహిత ప్రకటనలు చేయొద్దని మందలించింది.
ఇక, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన కేసులో ఆయనపై క్రిమినల్ చర్యలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీంతో ఆయనకు భారీ ఊరట లభించినట్లైంది.కాగా, వీర్ సావర్కర్పై గతేడాది రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లక్నోలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో రాహుల్ గాంధీ కోర్టు సమన్లు పంపింది. ఈ సమన్లను రద్దు చేయాలని రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.

అయితే ఏప్రిల్ 4న రాహుల్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుపట్టింది.
2022 నవంబర్ 17న మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగిన భారత్ జోడో యాత్రలో స్వాతంత్ర్య సమరయోధుడైన సావర్కర్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సావర్కర్ బ్రిటిషర్స్ సేవకుడు, వారి పెన్షనర్ అంటూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సావర్కర్ను ఆయన ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపిస్తూ నృపేంద్ర పాండే అనే న్యాయవాది లక్నోలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ కామెంట్స్పై జస్టిస్ దత్తా అభ్యంతరం వ్యక్తం చేశారు.
మహాత్మా గాంధీని కూడా బ్రిటీష్ సేవకుడు అంటారా?
వైస్రాయ్కు మహాత్మా గాంధీ రాసిన లేఖల్లో కూడా 'యువర్ ఫేత్ ఫుల్ సర్వేంట్' అనే పదాన్ని ఉపయోగించారని, అలాగని.. మహాత్మా గాంధీని బ్రిటిష్ సేవకుడు అని పిలవవచ్చా? అని సుప్రీంకోర్టు నిలదీసింది. 'ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో సావర్కర్ను ప్రశంసిస్తూ లేఖ రాసిన విషయం మీ క్టైంట్కు తెలుసా?' అని రాహుల్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని జస్టిస్ దత్తా ప్రశ్నించారు.
'సావర్కర్ ఏమైనా రాజకీయ నాయుకుడా? మహారాష్ట్రకు వెళ్లి ఒక ప్రకటన చేస్తారా? అక్కడ ఆయన్ను పూజిస్తారు. ఇంకోసారి ఇలా చేయొద్దు' అని జస్టిస్ దత్తా.. రాహుల్ను మందలించారు. స్వతంత్య్రాన్ని తీసుకొచ్చిన వారి పట్ల ఇలాంటి వ్యాఖ్యలను తాము అనుమతించబోమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. భవిష్యత్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దన్న షరతుపై ఇప్పుడు స్టే విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.












Click it and Unblock the Notifications