వలస కూలీలను పొమ్మన నోటితోనే.. మద్యం అమ్మకాలకు అనుమతి.. సుప్రీంకోర్టు సంచలనం..
కరోనా లాక్డౌన్ కారణంగా పరిమిత సంఖ్యలో, అత్యవసర కేసుల్ని మాత్రమే విచారిస్తోన్న సుప్రీంకోర్టు శుక్రవారం అనూహ్య తీర్పులు, ఆదేశాలు వెలువరించింది. ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డ వలస కూలీలను ఆదుకోవడం మా పనికాదన్న న్యాయమూర్తులు.. మద్యం అమ్మకాలకు మాత్రం ఆఘమేఘాల మీద అనుమతులు ఇవ్వడం, అందుకోసం హైకోర్టు తీర్పును తొక్కిపెట్టేయడం గమనార్హం. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని బెంచ్ విచారణకు చేపట్టిన అంశాలు విరుద్ధమైనవే అయినప్పటికీ వెలువడిన ఆదేశాలు చర్చనీయాంశాలయ్యాయి.

వలస కూలీలపై ఇలా..
లాక్ డౌన్ దెబ్బకు ఉపాధి కోల్పోయిన వలస కూలీలు వివిధ రాష్ట్రాల నుంచి తమ సొంత ఊళ్లకు నడుచుకుంటూ వెళుతోన్న దృశ్యాలు అందరికీ బాధకలిగిస్తున్నాయి. కూలీలకు షెల్టర్, ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఢిల్లీకి చెందిన ఓ లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దాన్ని శుక్రవారం కొట్టేసిన కోర్టు.. ‘‘రైలు ట్రాకులపై నిద్రపోతుంటే కూలీలను ఎవరు మాత్రం ఆపగలరు? వాళ్ల విషయంలో కేంద్రానికి ఎలాంటి ఆదేశాలివ్వబోము.. కూలీలు ఎక్కడ నడుస్తున్నారో ఆ రాష్ట్రాలదే బాధ్యత..''అని వ్యాఖ్యానించింది.

ఉద్యోగాలు, జీతాల కోతలపై..
వలస కూలీలపై పిటిషన్ కొట్టేసిన వెంటనే లాక్ డౌన్ లో ఉద్యోగుల తొలగింపు, జీతాల కోతల అంశంపై సుప్రీం విచారణ చేపట్టింది. ‘‘లాక్ డౌన్ సమయంలో ఏవైనా కంపెనీలు లేదా సంస్థలు ఉద్యోగులను తొలగించినా, జీతాల్లో కోతలు విధించినా ఆ చర్యను నేరంగా పరిగణిస్తాం, యాజమాన్యాలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం''అంటూ కేంద్ర హోం శాఖ మార్చి 25న జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపేసింది. అంతేకాదు, ‘‘ఉద్యోగులను తొలగించారనో, జీతాలు చెల్లించలేదనే కారణంగా యాజమాన్యాలపై ప్రభుత్వాలు చర్యలకు దిగొద్దు. ఇప్పుడప్పుడే వాళ్లజోలికి వెళ్లొద్దు..''అని హెచ్చరించింది. ఆ వెంటనే మద్యం అమ్మకాల కేసు విచారణకు రాగా..

మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్..
తమిళనాడులో మద్యం షాపుల వద్ద రద్దీ ఏర్పడటంతో అమ్మకాలను నిలిపేస్తూ మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. మద్యం అమ్మకాలు వద్దనే అధికారం హైకోర్టుకు లేదన్న పిటిషనర్ల వాదనతో సుప్రీం జడ్జిలు ఏకీభవించారు. దీంతో తమిళనాట మద్యం షాపులు మళ్లీ తెరుచుకున్నాయి. విచిత్రంగా.. వైరస్ వ్యాప్తికి అడ్డాలుగా మారుతోన్న మద్యం షాపులను మూసేయాలన్న పిటిషనర్లకు కూడా సుప్రీం నోటీసులు జారీచేయడం గమనార్హం.

మద్యం కొనడానికి ఆధార్ అవసరమా?
తమిళనాడులో మద్యం షాపుల రీఓపెనింగ్ పై సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. తమిళ సర్కారు తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. లిక్కర్ షాపులను మూసేయాలన్న మద్రాస్ హైకోర్టు.. మద్యాన్ని ఆన్ లైన్ లో విక్రయించి, డోర్ డెలివరీ చేయాలని, ఆధార్ కార్డు ఉంటేనే.. అది కూడా పరిమిత సంఖ్యలో బాటిల్స్ విక్రయించాలని ఆంక్షలు విధించింది. ‘‘ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడమే హైకోర్టుకు తగని పని. అలాంటిది.. మందు కొనడానికి ఆధార్ కార్డు కావాలనడం కరెక్టేనా? పైగా, తాగుబోతుల్ని మనం అసలే నమ్మలేం. ఏ నిమిషంలో గొడవలకు పాల్పడుతారో చెప్పలేం. ఢిల్లీ అంత క్లాస్ గా తమిళనాడు ఉండదుమరి'' అని రోహత్గీ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అయినాసరే కోర్టు ఆయన వాదనకే మొగ్గుచూపింది.
Recommended Video

పిటిషనర్లు ఏమన్నారంటే..
తాము మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపేయాలని కోరడం లేదని, దుకాణాల దగ్గర లాక్ డౌన్ రూల్స్ అమలయ్యేలా చూడమని మాత్రమే వేడుకుంటున్నామని మొరపెట్టుకున్నప్పటికీ.. పిటిషనర్లకు సైతం సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా తమిళనాడులో మే 7 నుంచి మద్యం అమ్మకాలు పున:ప్రారంభించారు. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్(టస్మాక్) ఆధ్వర్యంలోని మొత్తం 5,146 మద్యం దుకాణాల ద్వారా తొలిరోజే రికార్డు స్థాయిలో రూ.172 కోట్ల విక్రయాలు జరిగాయి. అయితే ఏ ఒక్క షాపు దగ్గర కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటించకపోవడం, చాలా చోట్ల గుంపును అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జి చేయాల్సి రావడం.. వెంటనే దుకాణాలను మూసేయించాలంటూ పిటిషన్ దాఖలు కావడంతో మద్రాస్ హైకోర్టు మే 8న మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. శుక్రవారం నాటి సుప్రీం ఆదేశాలతో దుకాణాలు మళ్లీ తెరుచుకున్నాయి.












Click it and Unblock the Notifications