సుప్రీంకోర్టు కీలక నిర్ణయం-విద్య వినియోగదారుల సేవా కాదా ? తేల్చేందుకు అంగీకారం
మన దేశంలో విద్యా హక్కు చట్టంతో పాటు విద్యను అందించేందుకు పలు చట్టాలున్నాయి. వీటి ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు పనిచేస్తున్నాయి. అయితే విద్య అనేది ఓ సేవలో భాగమే కాబట్టి అది ఇతర సేవల్లా వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వస్తుందా అన్న దానిపై కొత్తగా సందేహాలు మొదలయ్యాయి. దీనిపై దాఖలైన ఓ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
వినియోగదారుల రక్షణ చట్టంలో విద్య అనేది సేవ కాదా అనే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఇవాళ అంగీకరించింది. జస్టిస్ డి.వై. చంద్రచూడ్ , బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన మరో కేసు తీర్పు పెండింగ్ లో ఉండటంతో దాంతో పాటే ఈ కేసును కూడా విచారించి తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది.

2020 సివిల్ అప్పీల్ నంబర్ 3504 (మను సోలంకి, ఇతరులు వర్సెస్ వినాయక మిషన్ విశ్వవిద్యాలయం) పెండింగ్కు సంబంధించి, విద్య అనేది వినియోగదారుల రక్షణ చట్టంలో ఒక సేవ కాదా అనే సమస్య సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. దీంతో తాజా పిటిషన్ ను కూడా సివిల్ అప్పీల్ గా ట్యాగ్ చేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. విద్యాసంస్థలు వినియోగదారుల రక్షణ చట్టం, 1986 పరిధిలోకి రావని, సహ పాఠ్య కార్యక్రమాలతో కూడిన విద్య పరిధిలోకి రావని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సిఆర్డిసి) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ లక్నోకు చెందిన పిటిషనర్ దాఖలు చేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు విచారించింది. వాస్తవానికి 1986 నాటికి వినియోగదారుల రక్షణ చట్టంలో విద్య సేవగా లేదు.
2007లో ఈ పిటిషనర్ కుమారుడు స్విమ్మింగ్తో సహా వివిధ 'సమ్మర్ క్యాంప్' కార్యకలాపాలను అందించే ఓ స్కూల్లో చదువుతున్నాడు. ఆ స్కూల్ విద్యార్ధులకు వెయ్యి రూపాయలు తీసుకుని వేసవిలో శిక్షణ అందిస్తోంది. ఓ రోజు స్కూల్ నుంచి తన కుమారుడి ఆరోగ్యం బాగోలేదని ఫోన్ కాల్ వచ్చింది. దీంతో హడావిడిగా అక్కడికి వెళ్లాడు. కానీ అక్కడ స్విమ్మింగ్ పూల్ లో ముగినిపోయి ఊపిరాడకపోవడంతో కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. అక్కడికి వెళ్తే చనిపోయాక తీసుకొచ్చారని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి వినియోగదారుల కమిషన్లో కేసు పెట్టాడు. స్కూలు నుంచి 50 లక్షల పరిహారంతో పాటు తనకు మానసిక క్షోభ కలిగించినందుకు రూ.2 లక్షలు, కోర్టు ఖర్చులకు రూ.55 వేలు ఇప్పించాలని కోరాడు. విచారించిన కమిషన్.. ఈ వ్యవహారం వినియోగదారుల సేవ పరిధిలోకి రాదని తేల్చేసింది. దీంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు,












Click it and Unblock the Notifications