కోవిడ్ పై అంతా గందరగోళం: రంగంలోకి సుప్రీంకోర్టు: కేసులన్నీ అక్కడికే బదిలీ..!
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర హైకోర్టులు ఇప్పటికే ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు హైకోర్టులు చురకలంటించాయి. దీంతో రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు కోవిడ్ కేసులను సుమోటోగా తీసుకుంది. పెరుగుతున్న కేసులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. ఈ కేసులన్నీ సుప్రీంకోర్టుకు బదిలీ చేసుకుని తద్వారా గందరగోళం ఏర్పడకుండా చూసుకుంటామని పేర్కొంది. ఇప్పటికే హైకోర్టులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు కఠిన ఆదేశాలను జారీ చేశాయి.
నాగ్పూర్ జిల్లాలో రెమ్డెసివిర్ మెడిసిన్ కొరతపై బాంబే హైకోర్టులోని నాగ్పూర్ బెంచ్ ఏప్రిల్ 16న సుమోటోగా తీసుకుని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిడ్-19 పరిస్థితిని కట్టడి చేయడంలో మహా సర్కార్ విఫలమైందని పేర్కొంటూ కేసును సుమోటోగా తీసుకుంది. ఇక ఏప్రిల్ 20వ తేదీన ఢిల్లీ హైకోర్టు కోవిడ్ కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అడుక్కుంటారో, అరువు తెచ్చుకుంటారో, లేక దొంగతనం చేస్తారో తమకు అనవసరమని వెంటనే ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు మనుషుల ప్రాణాలంటే విలువ లేదా లెక్క లేదా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక అలహాబాదు హైకోర్టు కూడా యోగీ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 13న కోవిడ్ పై దాఖలైన పిల్ను విచారణ చేపట్టిన ధర్మాసనం ఉత్తర్ ప్రదేశ్లోని ఐదు నగరాల్లో లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ యోగీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ ఊరట లభించింది. ఇక ఢిల్లీ, బాంబే, అలహాబాదు కోర్టులే కాకుండా కర్నాటక, మద్రాస్ హైకోర్టుల్లో కూడా కోవిడ్ పై దాఖలైన పిల్లను విచారణ చేపడుతున్నాయి.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్వయంగా కోర్టులే జోక్యం చేసుకుని విచారణ చేస్తున్నాయి. గతేడాది కూడా వలస కార్మికుల ఇబ్బందులు, కష్టాలపై కోర్టులు స్పందించి విచారణ చేపట్టాయి. గతేడాది మే నెలలో లాక్డౌన్ సందర్భంగా వలస కార్మికుల వెతలను గుర్తించిన సుప్రీంకోర్టు ఆ కేసులను సుమోటోగా స్వీకరించి విచారణ చేసింది. వలస కార్మికులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారన్న విషయంపై దాఖలైన పిటిషన్లను విచారణ చేసిన హైకోర్టులు అధికారులను, ప్రభుత్వాల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా రంగంలోకి దిగి కేసులను విచారణ చేపట్టింది.
ఆ సమయంలో ఆయా రాష్ట్రాల్లో ఎంతమంది వలస కార్మికులు ఉన్నారు, వారిని సొంతూళ్లకు చేర్చేందుకు ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేశారు, రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఎలా ఉంది అనే అంశాలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే గతేడాది సెప్టెంబర్ వరకు ఈ కేసు కోర్టు ముందుకు రాలేదు. అప్పటికీ ఇంకా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు అడిగిన లెక్కలను అఫిడవిట్ రూపంలో సమర్పించలేదు.అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 139A హైకోర్టు లేదా పలు హైకోర్టుల్లోని కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేసుకునే వీలు కల్పిస్తోంది. ఒక కోర్టు లేదా పలు హైకోర్టులు ఒక కేసు నిమిత్తమై పలు విధాల అభిప్రాయాలు కలిగినప్పుడు ఈ గందరగోళంకు చెక్ పెట్టేందుకు సుప్రీంకోర్టు ఆ కేసులను తనవద్దకు బదిలీ చేసుకునే అధికారం రాజ్యాంగం కల్పిస్తోంది.
గతేడాది ఆగష్టులో ఆయా రాష్ట్ర హైకోర్టులో పెండింగ్లో ఉన్న 144 కేసులను సుప్రీంకోర్టు బదిలీ చేసుకుంది. ఇవన్నీ కూడా పౌరసత్వ సవరణ చట్టంకు సంబంధించినవే కావడం విశేషం. ప్రస్తుతం కరోనా సందర్భంగా ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో దేశ సమస్యగా భావించిన సుప్రీంకోర్టు కేసులను తమవద్దకు బదిలీ చేసుకునేందుకు మొగ్గు చూపింది. సుప్రీంకోర్టు కేసులను బదిలీ చేసుకుంటున్నట్లు చెప్పినప్పటికీ బాంబే ఢిల్లీ, మద్రాస్, కర్నాటక హైకోర్టులు కేసులను విచారణ చేశాయి. ఈ కేసులన్నీ సుప్రీంకోర్టుకు పూర్తిగా బదిలీ అయ్యే వరకు తాము విచారణ చేపడతామని అప్పటి వరకు వాయిదా వేయడం కుదరదని ఢిల్లీ హైకోర్టు బెంచ్ పేర్కొంది. బాంబే హైకోర్టు కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసింది.