నిర్భయ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు, మరణశిక్షే ఖాయం, పేరెంట్స్ స్పందన
Recommended Video
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషులకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఉరిశిక్షనే ఖాయం చేస్తూ సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. తమ ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలంటూ నేరస్తులు వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇలాంటి వారికి ఉరిశిక్షనే సరి అని తేల్చింది.
ఢిల్లీ హైకోర్టు సహా కింది కోర్టులు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్ను త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. కింది కోర్టులు విధించిన ఉరిశిక్షను సవాల్ చేస్తూ వారు సుప్రీంను గతంలోనే ఆశ్రయించారు. కింది కోర్టుల తీర్పును సమర్థిస్తూ 5 మే 2017న సుప్రీం తీర్పు చెప్పింది. అప్పుడు మరోసారి అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తీర్పును సవాల్ చేస్తూ ముగ్గురు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.
నిర్భయ కేసులో ఆరుగురు దోషులు కాగా నలుగురికి ఉరిశిక్ష విధించింది. తీహార్ జైలులో ఓ దోషి రాంసింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరో బాల నేరస్థుడికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత విడుదలయ్యాడు.
న్యాయం జరిగింది: నిర్భయ తల్లిదండ్రులు
ఎట్టకేలకు న్యాయం జరిగిందని నిర్భయ తల్లిదండ్రులు అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
ఏం జరిగిందంటే?
16 డిసెంబర్ 2012 న ఢిల్లీలో వైద్యవిద్యార్థినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా ఇనుప కడ్డీలతో కొట్టి రేప్ చేశారు. దీంతో తల, పేగులకు తగిలిన గాయాలతో పదమూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి 29 డిసెంబర్ 2012లో నిర్భయ తుది శ్వాస విడిచింది. 16వ తేదీ సాయంత్రం తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి వస్తుండగా ఐదుగురు ప్రయాణీకులు బస్సు ఎక్కారు.
మద్యం తాగి ఉన్న ఆ ఐదుగురు ఆమెను, స్నేహితుడిని ఇనుప కడ్డీతో కొట్టి బస్సులోనే గంటకు పైగా దారుణానికి పాల్పడ్డారు. వారిద్దరిని బస్సులో నుంచి తోసేశారు. అటువైపు నుంచి వెళ్తున్న కొందరు నిర్భయ వివస్త్రగా, అచేతనంగా పడి ఉండటాన్ని చూశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కొంతకాలం ఆమెను వెంటిలెటర్పై ఉంచారు. డిసెంబర్ 26న మెరుగైన చికిత్స కోసం సింగపూర్ మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించారు. 29న మరణించింది.