వీధి కుక్కల వ్యవహారంలో సుప్రీం తుది నిర్ణయం: కోర్టు ధిక్కారం
వీధి కుక్కల తరలింపు వ్యవహారంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తుది నిర్ణయాన్ని తీసుకుంది. గత ఏడాది నవంబర్ లో ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలని, ఇందులో మార్పులు చేయాలని దాఖలైన పిటీషన్లపై తన వైఖరిని తెలియజేసింది. నాటి ఆదేశాల్లో ఎటువంటి సవరణలు చేయడానికీ అంగీకరించలేదు. వాటిలో సవరణలు చేయడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు. ఆ ఆదేశాలు యధాతథంగా కొనసాగుతాయని తేల్చి చెప్పింది.
వాక్సినేషన్, స్టెరిలైజేషన్ అనంతరం వీధి కుక్కలను బహిరంగ ప్రదేశాల్లో తిరిగి వదలకూడదనే ఆదేశాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోలేదు. ఈ విషయంలో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటీషన్లను కొట్టివేసింది. అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లు ఇవి. వీటిని కోర్టు తోసిపుచ్చింది. ఫలితంగా.. వీధి కుక్కలు ఇకపై షెల్టర్లకే పరిమితం కావాలి.

ఈ పిటీషన్లు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్ వీ అంజారీలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చాయి. తాజాగా వీటిపై వాదోపవాదాలను ఆలకించిందీ బెంచ్. గత ఏడాది నవంబర్లో ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాల నుండి వీధి కుక్కలను తొలగించి ఆశ్రయాలకు తరలించక తప్పదని పునరుద్ఘాటించింది.
స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ తర్వాత కూడా వాటిని ఎక్కడైతే పట్టుకున్నారో అక్కడే విడిచిపెట్టకూడదని కూడా బెంచ్ ఆదేశించింది. పిల్లలపై వీధి కుక్కల దాడులకు సంబంధించిన అంశాలను తాజాగా ప్రస్తావించింది సుప్రీంకోర్టు. వీటిని తీవ్ర ఆందోళన కలిగించే ఘటనలుగా అభివర్ణించింది. పసి పిల్లలు, వృద్ధులు, విదేశీ పర్యాటకులు సైతం కుక్క కాటుకు గురైన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేసింది. కుక్కకాటు బెడద విమానాశ్రయాలను సైతం వదలట్లేదని వ్యాఖ్యానించింది.
తాము ఇచ్చిన ఆదేశాలు అమలు కావట్లేదని కూడా బెంచ్ స్పష్టం చేసింది. కుక్క కాటు ఘటనలు నిరంతరం పునరావృతమౌతూనే వస్తోన్నాయని పేర్కొంది. ఈ సంఘటనలు.. తమ ఆదేశాల అమలులో లోపాలను ఎత్తి చూపుతున్నాయని అభిప్రాయపడింది. ఆదేశాలను అమలు చేయని అధికారులపై కోర్టు ధిక్కార, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది.
నిర్దుష్ట ఫీడింగ్ ప్రాంతాల్లో తప్ప వీధి కుక్కులకు ఎక్కడపడితే అక్కడ ఆహారం పెట్టడాన్ని కూడా సుప్రీంకోర్టు ఇదివరకే నిషేధించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ కుక్కల ప్రేమికులు, జంతు హక్కుల సంఘాలు దరఖాస్తులు దాఖలు చేశాయి. వాటిపై విచారణ అనంతరం జనవరి 29న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తన తుది తీర్పును వినిపించింది సుప్రీంకోర్టు బెంచ్.












Click it and Unblock the Notifications