బీహార్ ఎస్ఐఆర్ రద్దుకు సుప్రీం హెచ్చరిక-అక్టోబర్ 7న తుది తీర్పు..!
బీహార్ లో తీవ్ర వివాదాస్పదంగా మారిన ప్రత్యేక ఓటు జాబితాల సవరణ ప్రక్రియపై విపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. మరోవైపు దీనిపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు అక్షింతలు వేస్తూనే ఉంది. ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు ఈసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నేరుగా హెచ్చరికలు పంపింది.
బీహార్ లో ఈసీ చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు తేలితే రద్దు చేసేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. బీహార్ ఎస్ఐఆర్ కోసం ఈసీ అనుసరించిన విధానం తప్పని తేలితే మొత్తం ప్రక్రియ రద్దు చేస్తామని ముందస్తు హెచ్చరికలు చేసింది. అలాగే అక్టోబర్ 7న ఈ కేసుపై తుది తీర్పు ఇస్తామని ప్రకటించింది.

ప్రత్యేక ఓటరు జాబితాల సవరణలో రాజ్యాంగ సంస్థగా ఈసీ చట్టపరమైన నిబంధనల్ని పాటించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మానం తెలిపింది. అందుకు విరుద్దంగా ఏమైనా చేసినట్లు తేలితే ఎస్ఐఆర్ రద్దుకు వెనుకాడబోమని తేల్చిచెప్పింది. బీహార్ ఎస్ఐఆర్ పై తాను ఇప్పుడే ఎలాంటి అభిప్రాయానికి రావడం లేదని, అయితే అక్టోబర్ 7న తాము ఇచ్చే తీర్పు మాత్రం ఈసీ భవిష్యత్తులో దేశవ్యాప్తంగా చేపట్టే ఎస్ఐఆర్ పై ప్రభావం చూపుతుందని మాత్రం వెల్లడించింది.

ఇప్పటికే బీహార్ ఎస్ఐఆర్ కారణంగా ఓటు హక్కు కోల్పోయిన 65 లక్షల మందిని తిరిగి ఆధారాలు సమర్పిస్తే ఓటరు జాబితాలో చేర్చాలని ఈసీకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతే కాదు ఓటు హక్కు కల్పించేందుకు ఆధార్ కార్డును తగిన ఆధారంగా స్వీకరించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆధార్ పౌరసత్వానికి ఆధారం మాత్రం కాదని స్పష్టం చేసింది. అయినా సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన జరుగుతోందన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అక్టోబర్ 7న తుది వాదనల తర్వాత తీర్పు ఇస్తామని, అందులో తేడా వస్తే మాత్రం రద్దు తప్పదని సుప్రీంకోర్టు హెచ్చరిస్తోంది.












Click it and Unblock the Notifications