అద్దెదారుల విషయంలో సుప్రీం సంచలన వ్యాఖ్యలు .. వాళ్ళ జులుం చెల్లందంటూ !!
అద్దెదారుల విషయంలో సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ కేసులో సుప్రీం ధర్మాసనం ఇంటి అద్దె కట్టకుండా యజమానుల ఇళ్లల్లో అద్దెకుంటూ, ఖాళీ చేయడానికి కూడా ఇష్టపడని అద్దెదారులకు షాక్ ఇచ్చేలా తీర్పునిచ్చింది. యజమానికి మాత్రమే తన ఇంటిపై సర్వ హక్కులు ఉంటాయని, అద్దెదారుల జులుం చెల్లదు అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇంటి ఓనర్ మాత్రమే నిజమైన యజమాని .. ఓ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
ఇంటి ఓనరు ఎవరైతే ఉంటారో వారే ఇంటికి నిజమైన యజమాని అని పేర్కొంది. మధ్యప్రదేశ్ కు చెందిన దినేష్ అనే వ్యక్తి ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ యజమానికి అద్దె డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ, ఖాళీ చెయ్యమంటే ఖాళీ చేయకుండా యజమానిని వేధింపులకు గురి చేయడంతో, సదరు అద్దెదారుడిపై యజమాని కోర్టును ఆశ్రయించారు . గత సంవత్సరం జనవరిలో చోటు చేసుకున్న ఈ ఘటన లో అప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు అద్దెదారుడికి తొమ్మిది లక్షల రూపాయల నగదు చెల్లించడానికి 4 నెలల సమయం ఇచ్చి, ఇల్లు ఖాళీ చేయాలని, అద్దె మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది.

మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన అద్దె దారుడు
అంతేకాదు యజమాని పిటిషన్ వేసిన రోజు నుంచి ఇల్లు ఖాళీ చేసే రోజు వరకు నెలకు ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున చెల్లించాలని కూడా కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించిన దినేష్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ యజమానిపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఇక అద్దె దారుడి పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం ధర్మాసనం, ఇల్లు వెంటనే ఖాళీ చేయాలని పేర్కొంది. అద్దెదారులు ఇంట్లో ఎంత కాలం నివసించినా ,సమయానికి అద్దె కట్టినా సరే వారు కేవలం అద్దెదారులుగానే ఉంటారని స్పష్టం చేసింది.

ఇళ్ళు ఖాళీ చెయ్యాలని ,అద్దె డబ్బులు చెల్లించాలని అద్దె దారుడిపై సుప్రీం సీరియస్
అద్దెదారుడు దినేష్ కు ఎలాంటి ఉపశమనం ఇవ్వడానికి సుప్రీం ధర్మాసనం అంగీకరించలేదు. ఇంటి అద్దె చెల్లించడానికి సమయం ఇవ్వాలని కోరగా, అద్దెదారుడికి ఇదివరకే చాలా ఎక్కువ సమయం కేటాయించడం జరిగిందని, ఇంకా సమయం ఇవ్వడం కుదరదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. యజమాని ఇంట్లోనే ఉంటూ, అద్దె చెల్లించకుండా యజమానిని వేధించటం కరెక్ట్ కాదని జస్టిస్ రోహింగ్టన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం అద్దెదారుడిపై సీరియస్ అయింది . సాధ్యమైనంత త్వరగా డబ్బులు చెల్లించాలని ఇంటిని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అద్దెదారుడిని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications