నిజస్వరూపం బయటపడింది: కిరణ్ బేడీపై సురవరం
హైదరాబాద్: కిరణ్ బేడీ బిజెపిలో చేరి తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో నిజాం చరిత్రతో పాటు వ్యతిరేక పోరాటాలను కూడా పాఠ్యాంశాలుగా చేర్చాలని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సురవరం సుధాకర్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు.
కార్పోరేట్ సంస్కృతిని మోదీ పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో యూపీఏ-3 పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఆరేడు నెలల మోదీ పాలన ప్రజల్లో అసంతృప్తి పెంచిదన్నారు. గతంలో అవినీతికి పాల్పడి, కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టిన సుఖరాంతో బిజేపీ పొత్తుపెట్టుకుందని విమర్శించారు. అవినీతి పరులైన సుఖరాం, యడ్యూరప్పలను అక్కున చేర్చుకున్న బిజెపి అవినీతికి వ్యతిరేకంగా ఎలా పోరాడుతుందని సురవరం ప్రశ్నించారు.

పదవులిస్తే బూట్ల దుమ్మును దులిపే నాయకులను బిజెపి తన పార్టీలోకి తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో బిజేపీకి ప్రతిఘటన తప్పదని సురవరం అన్నారు. ఎన్నికల వాగ్దానం మేరకు నల్ల ధనాన్ని తీసుకురావడంలో మోడీ విఫలమయ్యారని ఆయన అన్నారు.
మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న శక్తుల పట్ల మోడీ ఉదారంగా వ్యవహరిస్తున్నారని సుధాకర్ రెడ్డి తప్పు పట్టారు. సిపిఐ చీలినప్పటి నుంచి వామపక్షాలు బలహీనపడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. వామపక్షాల ఐక్యత తమ ప్రధాన ఏజెండా అని చెప్పారు. సిపిఐ కేంద్ర కమిటీ కొత్త రాజకీయ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు .












Click it and Unblock the Notifications