పింఛన్ దరఖాస్తుదారుల్లో రైనా, మహ్మద్ కైఫ్!
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పింఛన్ కోసం దరఖాస్తు చేసినవారిలో క్రికెటర్లు సురేశ్ రైనా, మహ్మద్ కైఫ్, రాజకీయ రంగంలో ఉన్న నటుడు రాజ్బబ్బర్ తదితరులు ఉన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి కూడా పింఛన్లు కల్పించడం, వారు దరఖాస్తు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజాధనాన్ని ఇలాంటివారిపై ఏకపక్షంగా ఖర్చు చేయడం తగదని ప్రతిపక్షాలు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ యశ్భారతి పురస్కారాన్ని దక్కించుకున్నవారికి నెలకు రూ.50,000 చొప్పున పింఛన్గా చెల్లిస్తామని గత అక్టోబరులో ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పురస్కారాలు పొందిన 141 మందిలో 108 మంది నిర్ణీత గడువులోగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ వర్గాలు తెలిపాయి.
సురేష్ రైనా, రాజ్బబ్బర్, కైఫ్, రాజ్ బబ్బర్, అతని భార్య నదిరా బబ్బర్, గాయకులు సుభా ముద్గల్, కైలాష్ ఖేర్ వంటివారూ దరఖాస్తు చేసుకోవడంపై భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అభ్యంతరం తెలిపాయి. పింఛన్ను తిరస్కరించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ను ఇతరులూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించాయి.