పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్2: కేవలం ఆ 7గురికి మాత్రమే ముందుగా తెలుసు
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లో పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఫిబ్రవరీ 14న పుల్వామా దాడి జరగగా, ఆ తర్వాతి రోజు నుంచి గోప్యంగా ప్రణాళికలను రూపొందించింది. ఈ దాడి గురించి కేవలం ఏడుగురికి మాత్రమే తెలుసునని తెలుస్తోంది.
ఈ దాడి ప్లాన్కు ఫిబ్రవరీ 18న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమోదం తెలిపారు. ఈ దాడి చేయాల్సిన సమయంతో పాటు ప్లాన్ గురించి ముందుగా ఏడుగురికి మాత్రమే తెలుసునని చెబుతున్నారు. వారే ప్రధాని మోడీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు, రా, నిఘా సంస్థ చీఫ్లు. వీరి ఏడుగురికి మాత్రమే తెలుసు.
ప్లాన్కు ముందు భారత రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సంస్థ 'రా' పాకిస్తాన్లోని పలు ఉగ్రస్థావరాల గురించి వివరించింది. వాటిలో బాలాకోట్ ప్రధానంగా ఉంది. ఇక్కడ జైష్ ఏ మహ్మద్ ఉగ్రసంస్థ చాలా కాలంగా ఉగ్రవాదులకు శిక్షణనిస్తోంది. బాలాకోట్ను భారత్ లక్ష్యంగా చేసుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
కాగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం రాత్రంతా జాగారం ఉన్నారట. కంటిమీద కునుకు లేకుండా మేల్కొని ఉండి అనుక్షణం పర్యవేక్షించారట. పైలట్లు అందరూ సురక్షితంగా తిరిగి వచ్చిన తర్వాతే ఉపశమనం పొందారు. సోమవారం రాత్రి ఒక టీవీ ఛానల్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న మోడీ రాత్రి తొమ్మిదింపావుకు లోక్కల్యాణ్ మార్గ్లోని నివాసానికి వెళ్లి, త్వరగా భోజనం ముగించారు.
ఆ తర్వాత వైమానిక దాడుల ఆపరేషన్ పర్యవేక్షణలో మునిగిపోయారు. ఆపరేషన్కు ముందు, జరుగుతున్నప్పుడు, ఆ తర్వాత ఆయన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, వైమానిక దళాధిపతి బీఎస్ ధనోవాలతో ఎప్పటికప్పుడు మాట్లాడారట. ఆపరేషన్ ముగియగానే పైలట్ల యోగక్షేమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు ఆపరేషన్లో పాల్గొన్నవారందరికీ అభినందనలు తెలిపారు.