పాక్కు పట్టుబడిన జవాను: షాక్తో గ్రాండ్ మదర్ మృతి
న్యూఢిల్లీ: భారత సైన్యం సర్జికల్ దాడులు చేసిన సందర్భంగా పాకిస్తాన్కు పట్టుబడిన భారత జవాను చందు బాబులాల్ చొహాన్ గ్రాండ్ మదర్ షాక్కు గురై మృత్యువాత పడింది. జవాను కుటుంబ సభ్యులతో హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు.
చందు బాబులాల్ చొహాన్ సన్నిహిత కుటుంబ సభ్యులతో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. మహారాష్ట్రలోని ధూలేకు చెందిన బాషన్ చొహాన్ కుమారుడు చందు బాబులాల్ చొహాన్. పాకిస్తాన్ చెర నుంచి జవానును విడిపించడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ జవాను కుటుంబ సభ్యులకు చెప్పారు.
జవాను నియంత్రణ రేఖను దాటడానికి సర్జికల్ దాడులకు సంబంధం లేదని అంటున్నారు. 37ఆర్ఆర్కు చెందిన జవాను ఒకతను అనుకోకుండా సరిహద్దులు దాటాడని డిజిఎంవో చెప్పారు. జవానును పాకిస్తాన్ చెర నుంచి విడిపించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ అంతకు ముందు మీడియాతో చెప్పారు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి భారత సైన్యం ప్రవేశించి ఏడు లాంచ్ పాడ్స్ను ధ్వంసం చేసిన విషయం తెలిసింది. భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడుల్లో 38 దాకా ఉగ్రవాదులు మరణించినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటనతో భారత, పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. దాంతో పాకిస్తాన్ చెరలో ఉన్న జవాను విడుదల అంత సులభసాధ్యం కాదనే మాట వినిపిస్తోంది.