తొలి మహిళా మంత్రిగా సుష్మా: ఎంపి కాకుండానే నిర్మల
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్(62) మరో రికార్డును సృష్టించారు. ఇప్పటికే అతి చిన్న వయసులో పాతికేళ్లకే మంత్రి పదవిని అలంకరించి రికార్డు సృష్టించిన సుష్మా స్వరాజ్.. ఇప్పుడు విదేశాంగ శాఖ, ప్రవాస భారతీయ వ్యవహరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. విద్యార్థి దశలోనే అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబివిపి) ద్వారా సుష్మా స్వరాజ్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
పట్టుదల, అంకితభావంతో చురుకైన కార్యకర్తగా ఎదిగిన సుష్మా స్వరాజ్.. చిన్న వయసులోనే ఉన్నతమైన పదవులు పొందారు. ఆమె 1977లో హర్యానా ప్రభుత్వంలో 25 ఏళ్లకే మంత్రి పదవి చేపట్టారు. 1998లో ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతేగాక ఒక రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధిగా పని చేసిన తొలి మహిళ సుష్మా రాజ్ కావడం విశేషం.
సుష్మా స్వరాజ్ 1979లో హర్యానా బిజెపి అధ్యక్షురాలుగా పని చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును కూడా ఆమె అందుకున్నారు. 1996లో 13 రోజుల వాజ్పేయి ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పని చేశారు. 1998లో వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రి పదవికి రాజీనామా చేసి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. సుష్మా స్వరాజ్ ఏడుసార్లు లోకసభకు, మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె సుప్రీం కోర్టులో న్యాయవాదిగా కూడా కొంతకాలం పని చేశారు.
ఎంపి కాకుండానే నిర్మలా సీతారామన్కు మంత్రి పదవి
ప్రస్తుతం లోకసభలో గానీ, రాజ్యసభలో గానీ సభ్యురాలు కానప్పటికీ బిజెపి అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్కు నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కింది. ఆమె తమిళనాడులోని తిరుచిరాపల్లిలో 1959, ఆగస్టు 18న జన్మించారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నగరంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 1980లో సీతాలక్ష్మీ రామస్వామి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. రాష్ట్రానికి చెందిన రాజకీయ, టీవీ వ్యాఖ్యాత డాక్టర్ పరకాల ప్రభాకర్తో ఆమెకు వివాహమైంది. ఢిల్లీ జెఎన్యులో చదువుతుండగా పరకాలతో ఏర్పడిన పరిచయం పరిణయంగా మారింది. నిర్మలా సీతారామన్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా పని చేశారు. అత్తామామలు కాంగ్రెస్ వారైనప్పటికీ బిజెపి వైపు ఆమె ఆకర్షితులు కావడానికి ఇది తోడ్పడింది. 2003-05 మధ్య కాలంలో 33శాతం మహిళా రిజర్వేషన్ విధానానికి బిజెపి శ్రీకారం చుట్టింది.
పరకాల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న కాలంలో.. చాలాకాలం పాటు ఆమె ఇంటి అవసరాలపై పూర్తి సమయం కేటాయించారు. తొలుత కాంగ్రెస్ నేతగా మొదలయి.. బిజెపిలో బాగా ఎదిగి.. చివరికి ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన పరకాల, ప్రత్యేక, సమైక్య ఉద్యమకాలంలో విశాలాంధ్ర మహాసభను స్థాపించారు. ఈ క్రమంలో భర్త రాజకీయ విశ్వాసాలను గౌరవిస్తూనే, తాను బిజెపిలో ఎదిగారు నిర్మలా సీతారామన్.
బిజెపి అధికార ప్రతినిధిగా మన్ననలు అందుకున్నారు. ఎన్డీయే హయాంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి నియమితులయ్యారు. ప్రస్తుతం అధికార ప్రతినిధిగా రాణిస్తున్నారు. మోడీకి మద్దతుగా మీడియాను కూడగట్టడంలో వ్యూహాత్మక పాత్రని పోషించారు. వాగ్ధాటి గల నాయకురాలు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నడూ లేకపోయినా, ఆమెను ఏరికోరి తన కేబినెట్లోకి తీసుకొన్నారు.