జ్ఞానవాపి మసీదులో పూజలు- వారణాసి కోర్టు తీర్పుపై ఉత్కంఠ- యూపీలో భారీ భద్రత
ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో తాజాగా నిర్వహించిన సర్వే సందర్భంగా శివలింగం బయటపడటంతో అక్కడ పూజలకు అనుమతివ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై ఇవాళ వారాణాసి కోర్టు తీర్పు వెలువరించబోతోంది. దీంతో యూపీ వ్యాప్తంగా దీనిపై ఉత్కంఠ నెలకొంది.
జ్ఞానవాపి మసీదులో సర్వేకు గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సర్వే బృందం అక్కడ సర్వే నిర్వహించి శివలింగం బయటపడినట్లు నివేదిక ఇచ్చారు. దీంతో అక్కడ పూజలకు అనుమతివ్వాంటూ నలుగురు మహిళలు వారణాసి కోర్టును ఆశ్రయించారు. అయితే అది శివలింగం కాదంటూ మసీదు కమిటీ కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు ఇవాళ తీర్పు ప్రకటించబోతోంది. ఈ తీర్పు భవిష్యత్తులో మసీదు భవిష్యత్తును నిర్ణయించేది కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
ఇవాళ వారణాసి కోర్టు ఇచ్చే తీర్పులో నలుగురు మహిళలు పూజలకు అనుమతి కోరడాన్ని అనుమతించవచ్చా లేదా అనేది స్పష్టం కానుంది. అలాగే ప్రార్ధనా స్ధలాల చట్టం ప్రకారం ఇలా ప్రతీ ఆలయంలో తవ్వకాలు, సర్వేలు జరిపి విగ్రహారాధనలకు అనుమతివ్వొచ్చా లేదా అనే విషయాన్ని కూడా స్పష్టం చేయబోతోంది. ఇవాళ పూజలు నిర్వహించుకునేందుకు వారణాసి కోర్టు అనుమతిస్తే ఈ వ్యవహారం అలహాబాద్ హైకోర్టుకు, అనంతరం సుప్రీంకోర్టు వరకూ చేరే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో వారణాసి కోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారిపోతోంది.
వారణాసి కోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యూపీతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తీర్పు వెలువడిన తర్వాత ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.