తదుపరి ఛీఫ్ జస్టిస్పై ఉత్కంఠ- జస్టిస్ ఎన్వీ రమణకే ఛాన్స్ - బాబ్డే నిర్ణయం కీలకం
తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు ? సీనియార్టీ ప్రకారం రేసులో ఉన్న జస్టిస్ ఎన్వీరమణకే అవకాశం దక్కబోతోందా ? సుప్రీంకోర్టు కొలీజియం తీసుకునే నిర్ణయం ఏంటి ? తదుపరి సీజేగా ప్రస్తుత సీజే బాబ్డే ఎవరిని సిఫార్సు చేయబోతున్నారు ? కేంద్ర ప్రభుత్వానికి వెళ్లే సిఫార్సు, కొలీజియం తీసుకునే నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. అన్నింటి కంటే మించి ఏపీ నుంచి తొలిసారి సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ అయ్యే అవకాశానికి అడుగు దూరంలో ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ రికార్డు సృష్టిస్తారా లేక గతంలో ఏపీ ప్రభుత్వం ఆయనపై చేసిన ఆరోపణలు అడ్డంకిగా మారతాయా ? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే ప్రశ్నలు..
తదుపరి ఛీఫ్ జస్టిస్ ఎవరు?
ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ శరద్ బాబ్డే పదవీకాలం వచ్చే నెల 23తో ముగిసిపోనుంది. దీంతో ఆయన స్ధానంలో వచ్చే తదుపరి సీజే కోసం కసరత్తు ప్రారంభమైంది. సీనియార్టీ ప్రాతిపదికన సుప్రీంకోర్టు కొలీజియం చేపట్టే ఈ నియామకం చాలా కీలకమైనది.
ఇందుకోసం ప్రస్తుత సీజే బాబ్డే సిఫార్సు చేసే పేరును కేంద్ర న్యాయశాఖ పరిశీలించి సుప్రీంకోర్టు కొలీజియానికి పంపుతుంది. ఇతరత్రా ఆరోపణలు, ఇబ్బందులేవీ లేకపోతే కొలీజియం దానికే ఆమోద ముద్ర వేస్తుంది. అసాధారణ పరిస్ధితుల్లో మాత్రమే సీజే, కేంద్రం పంపిన పేరును కొలీజియం తిరస్కరిస్తుంది. దీంతో తర్వాత ఛీఫ్ జస్టిస్ ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
సీజే రేసులో తెలుగు వాడు ఎన్వీ రమణ
చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలేవీ చోటు చేసుకోకపోతే సీనియార్టీ ప్రకారం ఛీఫ్ జస్టిస్ రేసులో ముందున్న ఎన్వీరమణకే అవకాశం దక్కబోతోంది. ఏపీలోని గుంటూరు జిల్లాకి చెందిన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ పదవి అలంకరించిన తొలి తెలుగు వాడిగా గుర్తింపు పొందనున్నారు. ప్రస్తుత సీజే బాబ్డే జస్టిస్ ఎన్వీ రమణ పేరును తదుపరి సీజేగా ప్రతిపాదిస్తారని అంచనా వేస్తున్నారు.
అదే జరిగితే కేంద్రం కూడా సుప్రీంకోర్టు కొలీజియానికి ఆయన పేరును పంపించక తప్పదు. అప్పుడు తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ పేరు ఖరారయ్యే అవకాశముంది. ఒకవేళ జస్టిస్ రమణ సీజే పదవి చేపడితే ఆయన ఏకంగా 16 నెలల పాటు ఆ పదవిలో ఉండే అవకాశం ఉంది. ఆయన 2022 ఆగస్టులో రిటైర్ అవుతారు.
తర్వాతి సీజే పేరు ప్రతిపాదించాలని కోరిన కేంద్రం
భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న వ్యక్తి తన రిటైర్మెంట్ అయ్యే సమయంలో తన తర్వాత ఆ పదవిని అలంకరించేందుకు యోగ్యుడైన న్యాయమూర్తిని కేంద్ర ప్రభుత్వానికి సూచించడం ఆనవాయితీగా వస్తోంది. దీని ప్రకారం కేంద్రం తన వారసుడి పేరు సూచించారని ఛీఫ్ జస్టిస్ను అధికారికంగా కోరుతుంది. ఇప్పుడు ఛీఫ్ జస్టిస్ బాబ్డేను కూడా ఇదే విధంగా కేంద్రం కోరింది. దీంతో ఆయన తన వారసుడి పేరును కేంద్రానికి సీల్డ్ కవర్లో పంపనున్నారు. దీన్ని పరిశీలించి కేంద్రం తిరిగి సుప్రీంకోర్టు కొలీజియానికి పంపుతుంది. కొలీజియం కూడా అంగీకారం తెలిపితే తర్వాతి సీజే పేరును నోటిఫై చేస్తుంది.
జస్టిస్ రమణకు ఏకైక అడ్డంకి అదే.. ?
గతంలో ఏపీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా, బార్ కౌన్సిళ్లకు ఛైర్మన్గా, ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ తర్వాతి ఛీఫ్ జస్టిస్గా ఎంపికయ్యేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయి. అయితే ఆయనపై గతేడాది వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలు, సీఎం జగన్ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డేకు జస్టిస్ రమణపై చేసిన ఫిర్యాదులు ఆయనకు ఇబ్బందికరంగా మారొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి.
అయితే ఇప్పటివరకూ జస్టిస్ రమణపై వచ్చిన ఆరోపణల్ని సుప్రీంకోర్టు సీజే సహా ఎవరూ నిర్ధారించలేదు. దీంతో ఈ ఆరోపణలు ఆయన ఛీఫ్ జస్టిస్ అయ్యేందుకు అడ్డంకి కాకపోవచ్చని తెలుస్తోంది. కేవలం ఊహాజనిత అంశాలతో రాజకీయ నేతలు చేసిన ఆరోపణల ఆధారంగా రమణకు ఛీఫ్ జస్టిస్ పదవి నిరాకరించకపోవచ్చని సమాచారం.