ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య: రాంకుమార్ తల్లి కొత్తవాదన
చెన్నై: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసులో నిందితుడు రాంకుమార్ తల్లి కొత్త వాదనను ముందుకు తెచ్చింది. స్వాతి హత్య కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ రామ్కుమార్ తల్లి పుష్పం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై తన నిర్ణయాన్ని మద్రాసు హైకోర్టు మంగళవారం రిజర్వ్ చేసింది.
తన కుమారుడు రాంకుమార్పై తప్పుడు కేసు బనాయించారని, తద్వారా అసలు దోషులను రక్షించాలని పోలీసులు చూస్తున్నారని తల్లి పుష్ప పిటిషన్ దాఖలు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది రామరాజ్ చెప్పారు. ఒక వ్యక్తి మూడు నాలుగు కత్తిపోట్లు పొడిచే అవకాశం లేదని, స్వాతి శరీరంపై ఉన్న గాయాలను చూస్తే హంతకుడు చాలా నిపుణుడని తెలుస్తోందని రామ్ రాజ్ వాదించారు.
స్థానిక నుంగంబాక్కం రైల్వేస్టేషన్ వద్ద జూన్ 24వ తేదీ ఉదయం స్వాతి దారుణహత్యకు గురికావటం, వారం రోజుల తర్వాత ఆ సంఘటనకు సంబంధించి డి. మీనాక్షిపురానికి చెందిన రామ్కుమార్ అనే ఇంజనీరింగ్ విద్యార్థిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాంకుమార్ పుళల్ సెంట్రల్ జైలులో ఉన్నాడు.
రామ్కుమార్ తల్లి తరఫు న్యాయవాది రామరాజ్ తన వాదనలను వినిపిస్తూ -స్వాతి వంటిపై ఉన్న గాయాలను చూస్తే ఒక వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు భావించలేమని అన్నారు. స్వాతి హత్య కేసును నుంగంబాక్కం పోలీసులు సక్రమంగా విచారణ జరపలేదనీ, స్వాతి హత్య జరిగిన వెంటనే ముత్తుకుమార్, ఇస్మాయిల్ అనే ఇరువురికి ఆ హత్యతో సంబంధం ఉన్నట్టు పుకార్లు వ్యాపించాయని, అయితే పోలీసులు ఈ ఇరువురి వద్ద విచారణ జరపలేదని ఆరోపించారు.
స్వాతి ఎవరో కూడా రాంకుమార్కు తెలియదని, తన ప్రేమను నిరాకరించడం వల్లనే స్వాతిని రాంకుమార్ హత్య చేశారనే ఆరోపణల్లో నిజం లేదని రామ్ రాజ్ అన్నారు.
లీసుల తరఫున హాజరైన న్యాయవాది ఎమిలియాస్ తన వాదనలను వినిపిస్తూ హత్య కేసులో నిందితుడి తరఫువారికి విచారణ సంస్థను మార్చాలని అడిగే హక్కులేదన్నారు. ఈ పిటిషనపై తాము కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసే ప్రసక్తే లేదని, ఇప్పటి వరకు జరిపిన విచారణ వివరాల నివేదికను హైకోర్టుకు సమర్పిస్తామని, వాటిని పరిశీలించిన తర్వాత న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభిమతమేనని చెప్పారు.