కరోనాతో పాటు ఇప్పుడు స్వైన్ ఫ్లూ కూడా ... తస్మాత్ జాగ్రత్త !!
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం అతలాకుతలం అవుతుంటే, మరోపక్క చాపకింద నీరులా స్వైన్ ఫ్లూ కూడా విస్తరిస్తోంది. కర్ణాటక ,తెలంగాణ రాష్ట్రాలలో స్వైన్ ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి .ఈ సంవత్సరం జులై 31 వ తేదీ వరకు అత్యధికంగా కర్ణాటక రాష్ట్రంలో 458 కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 443 కేసులు నమోదయ్యాయి.
జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం దేశంలో ఈ సంవత్సరం జులై 31 వ తేదీ వరకు 2721 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు తరువాత ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోనూ అధికంగా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 412, తమిళనాడులో 253, ఉత్తరప్రదేశ్లో 252 కేసులు నమోదయినట్లుగా నివేదిక చెబుతోంది.
స్వైన్ ఫ్లూ వైరస్ కూడా కరోనా వైరస్ తరహాలోనే ప్రమాదకరమైన వైరస్.

జలుబు ,దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలతో ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది ఈ వైరస్. ఒకపక్క కరోనాకు సంబంధించిన లక్షణాలు , స్వైన్ ఫ్లూ కి సంబంధించిన లక్షణాలు ఒకే విధంగా ఉండటంతో జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా స్వైన్ ఫ్లూ ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లలు,గర్భిణీలు,ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వయసుపైబడిన వారిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.
ప్రస్తుత పరిస్థితులలో ఈ లక్షణాలతో బాధపడుతున్న వారు ఎవరైనా కరోనా పరీక్షతోపాటుగా, ఇన్ఫ్లూయెంజా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు అంటున్నారు. స్వైన్ ఫ్లూ వైరస్ కూడా తుమ్మడం, దగ్గడం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది . కాబట్టి ఈ వైరస్ బారిన పడకుండా ఉండటం కోసం ప్రజలు మార్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని వైద్యులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటికే కరోనాతో దేశం కల్లోలంగా మారుతున్న సమయంలో స్వైన్ ఫ్లూ కూడా విజృంభిస్తున్న పరిస్థితులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications