తాజ్ మహల్ పేరును మార్చండి, రామ్ మహల్ అని పెట్టండి: యూపీ బీజేపీ ఎమ్మెల్యే
లక్నో: ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే వారిని బూటుతో మొహం మీద కొట్టాలని వ్యాఖ్యలు చేసిన ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొఘలుల కాలం ముగిసిన తర్వాత కూడా మన దేశంలోని రోడ్లకు, చారిత్రకట్టడాలకు వారి పేర్లు ఉండటం సరైనది కాదన్నారు.
తాజ్ మహల్ పేరును రామ్ మహల్ లేదా కృష్ణ మహల్గా మార్చాలని విజ్ఞప్తి చేశారు. మన నేలపై మొఘలుల కట్టడాలు ఉన్నాయి కనుక వాటిని కూల్చేందుకు వీలు లేదని, అందుకు బదులుగా వాటి పేర్లు మారిస్తే సరిపోతుందన్నారు. ఒకవేళ తాజ్ మహల్ పేరును మార్చే అవకాశం తనకు లభిస్తే దాని పేరును రాష్ట్ర భక్తి మహల్గా మారుస్తానని చెప్పారు.
మన దేశంలో ఉన్న మొఘల్ కట్టడాల్లో ఒక దానికి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెడితే ఆ అనుభూతే వేరనన్నారు. అద్భుతంగా ఉంటుందన్నారు. మొఘలులు భారత గడ్డపై నిర్మాణాలు చేపట్టారని, కాబట్టి వాటిని కూల్చడానికి వీల్లేదన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఒకవేళ లంచం అడిగితే వారిని బూటుతో మొహం మీద కొట్టాలంటూ సురేంద్ర సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. సురేంద్ర సింగ్ గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని శూర్పణఖగానూ, నరేంద్ర మోడీని రామావతారంగానూ అభివర్ణించారు.