కాశ్మీర్ పై బాంబు పేల్చిన తాలిబన్ నాయకుడు, ఆ షాకింగ్ కామెంట్స్ పై భగ్గుమన్న భారత్ !!
ఆఫ్ఘనిస్థాన్ నుండి అమెరికా తమ బలగాలను ఉపసంహరించుకున్న ప్రభావం భారతదేశంలోని జమ్మూకాశ్మీర్ పై కనిపిస్తోందా? మొన్నటికి మొన్న ఆరు గ్రూపులో ఉగ్రవాదులు కాశ్మీరులోయలోకి చొరబడ్డారు అని వారు భారత్లో దాడులకు పాల్పడే అజెండాతో వచ్చారని నిఘా సంస్థలు హెచ్చరికలతో ఇబ్బంది పడుతున్న భారత్ కు ఇప్పుడు తాలిబన్లు కొత్త సమస్యగా మారబోతున్నారా ? తాజాగా కాశ్మీర్ తో సహా ఎక్కడైనా ముస్లింల కోసం తమ స్వరాన్ని పెంచే హక్కు తమకు ఉందని ఉగ్రవాద సంస్థ తాలిబన్ పేర్కొనడం అందుకు ఊతమిస్తోందా ? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది.
ఆఫ్ఘనిస్థాన్ వశం చేసుకున్న తాలిబన్ల ఫోకస్ దేనిపైన?
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల అరాచకం కొనసాగుతోంది. ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా దళాల ఉపసంహరణపై అదేదో పెద్ద విజయం సాధించినట్టు తాలిబన్లు సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు రోజురోజుకు దయనీయంగా మారుతున్నాయని. రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభాలు ఆఫ్ఘనిస్తాన్ వాసులను పీడిస్తున్నాయి. ఇవేవీ పట్టనట్టు బయటకు ఒకటి చెబుతూ, లోపల ఇంకొకటి చేస్తూ తాలిబన్లు తమ క్రూర పాలనను కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పుడు తాలిబన్ల నెక్స్ట్ టార్గెట్ ఏమిటి అన్న దానిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది.
కాశ్మీర్ తో సహా ఎక్కడైనా ముస్లింల కోసం ..తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ వ్యాఖ్యలు
తాలిబన్ పాలనలో ఆఫ్ఘనిస్థాన్ భూభాగం భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని భారతదేశం ఇప్పటికే ఆందోళనలో ఉంది. ఈ క్రమంలో తాజాగా కాశ్మీర్తో సహా ఎక్కడైనా ముస్లింల కోసం తమ స్వరాన్ని పెంచే హక్కు తమకు ఉందని ఉగ్రవాద సంస్థ పేర్కొంది. ఏదేమైనా, ఏ దేశానికీ వ్యతిరేకంగా ఆయుధాలను పెంచే విధానం గ్రూపుకు లేదని చెప్తూనే ముస్లింల కోసం పోరాటం చేస్తామని చెప్పటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది.
తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ భారతదేశంలోని కాశ్మీర్ తో సహా, ఏ ఇతర దేశంలోనైనా ముస్లింల కోసం మా స్వరాన్ని పెంచడానికి ముస్లింలుగా మాకు హక్కు ఉందని వెల్లడించారు.
ముస్లింల సమానత్వం కోసం పోరాటం చేస్తాం అని వెల్లడి
తాము ముస్లింల కోసం స్వరాన్ని పెంచుతామని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు అంతా తమవారేనని, చట్టాల ప్రకారం వారికి సమాన హక్కులు కల్పించాలని తమవంతు పోరాటం చేస్తామని వెల్లడించారు. షహీన్ వ్యాఖ్యలు కాశ్మీర్పై తాలిబన్ గ్రూప్ గతంలో చేసిన ప్రకటనలకు భిన్నంగా ఉన్నాయి. కాబూల్ నియంత్రణలోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత, తాలిబన్లు కాశ్మీర్ విషయంలో స్పందించారు . కాశ్మీర్ ఒక ద్వైపాక్షిక మరియు అంతర్గత విషయం అని చెప్పారు. కొద్ది రోజుల క్రితం భారత్ పాకిస్తాన్ అంతర్గత వ్యవహారంలో తలదూర్చమని చెప్పి ఇప్పుడు ఇలాంటి ప్రకటన చెయ్యటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాద స్థావరం కాకుండా.. భారత్ తాలిబన్ నాయకులతో సంప్రదింపులు
ఇక తాలిబన్ నాయకుడితో చర్చల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగం ఏ విధమైన ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించబడకుండా చూడటమే భారతదేశ లక్ష్యమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి కూడా పేర్కొన్నారు.మొట్టమొదటి అధికారికంగా మరియు బహిరంగంగా ఆమోదించబడిన సంప్రదింపులో, ఖతార్లోని భారత రాయబారి దీపక్ మిట్టల్ మంగళవారం సీనియర్ తాలిబన్ నాయకుడు షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్ని కలుసుకున్నారు .
గతంలో ఆయన ఇండియన్ మిలటరీ లో ట్రైన్ అయిన జవాన్ కావటంతో ఆయన ద్వారా తమ ఆందోళన తెలియజేశారు . ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలు మరియు తీవ్రవాదానికి ఉపయోగించకూడదనే భారతదేశ ఆందోళనలను తెలియజేశారు.
కాశ్మీర్ అంశంపై తాలిబన్ల సాయం కోరిన ఆల్ ఖైదా
ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న భారతీయ జాతీయుల భద్రత, భారత్ కు వచ్చిన ఆఫ్ఘన్ జాతీయులు, ముఖ్యంగా మైనారిటీ వర్గాల సభ్యులు రాకపై కూడా చర్చలు జరిగాయని తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ తీవ్రవాదానికి కేంద్రంగా మారవచ్చునని ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే కాశ్మీర్ అంశంపై ఆల్ ఖైదా తాలిబన్ల సాయం కోరింది. ఆఫ్ఘనిస్థాన్ ఆక్రమణకు సహాయం చేసినందుకు ప్రతిగా కాశ్మీర్ అంశంలో సహాయం చెయ్యాలని ఆల్ ఖైదా కోరింది. కానీ తాలిబన్లు ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉన్నారు.
జమ్మూ కాశ్మీర్లో భద్రతా నిఘా పెంపు .. కాశ్మీర్ విముక్తిపై పాక్ దృష్టి, తాలిబన్ల సాయం
జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులపై పెరుగుతున్న ఆందోళనల మధ్య, ఈ ప్రాంతంలో భారతదేశం భద్రతా నిఘాను పెంచింది. కాశ్మీర్లో భద్రతా నిఘా నేపధ్యంలో ప్రస్తుతం పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయి. ఇటీవల, పాకిస్తాన్ అధికారంలో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ప్రభుత్వం యొక్క నాయకుడు, తాలిబన్లు భారతదేశానికి కాశ్మీర్ను 'విముక్తి' చేయడంలో దేశానికి సహాయం చేస్తారని చెప్పారు. పాక్ నాయకుడు నీలం ఇర్షాద్ షేక్ మాట్లాడుతూ, తాలిబాన్లు మాతో ఉన్నారని, కాశ్మీర్లో విముక్తికి వారు మాకు సహాయం చేస్తారని చెప్పటం కూడా ఆందోళన కలిగిస్తుంది.
Recommended Video
తాజా వ్యాఖ్యలతో తీవ్ర దుమారం .. భగ్గుమంటున్న భారత్
తాజా పరిస్థితులు, తాలిబన్ నాయకుడి తాజా వ్యాఖ్యలతో కాశ్మీర్ పై భారత్ కు తీవ్ర ఆందోళన నెలకొంది. భారత్ తాలిబన్ నాయకుడి వ్యాఖ్యలపై మండిపడుతుంది. ముందు తాలిబన్లతో దోస్తీ చేస్తామని చెప్పిన డ్రాగన్ దేశం చైనాలోని ఉయ్ఘర్ ముస్లింల అణచివేత గురించి పోరాటం చెయ్యమని తాలిబన్లకు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. తర్వాత ప్రపంచం గురించి ఆలోచించవచ్చని చెప్తున్నారు. ఏది ఏమైనా తాలిబన్లను నమ్మరాదని, వాళ్ళు చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండదని, అప్రమత్తంగా ఉండటం అవసరం అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.