కశ్మీరే కాదు పీవోకే కూడా.. ట్రంప్ కామెంట్లపై విపక్షాల నిరసనతో రాజ్నాథ్ సెటైర్లు
న్యూఢిల్లీ : కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పార్లమెంట్ ఉభయ సభలు ఇవాళ కూడా దద్దరిళ్లాయి. ప్రధాని మోడీ సూచన మేరకే ప్రకటన చేశానని ట్రంప్ చెప్పడంతో విపక్షాలు .. అధికార పార్టీని టార్గెట్ చేశాయి. దీనిపై పార్లమెంట్లో మోడీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఉభయసభలకు ఆటంకం కలిగిస్తున్నాయి. దీంతో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కల్పించుకొని సమాధానం చెప్పారు. నిన్న విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చేసిన ప్రకటనను ఉదహరిస్తూ .. ట్రంప్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.
సుందర కశ్మీర్
కశ్మీర్ అనేది దేశానికి తలమానికం అని పేర్కొన్నారు రాజ్నాథ్ సింగ్. సున్నితమైన సమస్యపై మేం ఎట్టిపరిస్థితుల్లో రాజీపడబోమని తేల్చిచెప్పారు. అయితే పాకిస్థాన్తో కశ్మీర్ అంశంపై చర్చించాలని అనుకుంటే .. దాంతోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్పై కూడా చర్చించాల్సిందేనని స్పష్టంచేశారు. సుందర కశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లేని భారత్ను ఊహించుకోలేమని ఉద్ఘాటించారు. ఒకవేళ చర్చలు జరపాల్సి వస్తే ఈ రెండు అంశాలపై తప్పకుండా డిస్కష్ చేయాల్సిందేనని తమ ప్రభుత్వ వైఖరిని పరోక్షంగా తెలియజేశారు.

అగ్గిరాజేసింది
ఇటీవల అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్, ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించాలని ప్రధాని మోడీ కోరారని పేర్కొనడంతో వివాదం చెలరేగింది. అయితే దీనిని వెంటనే విదేశాంగ ఖండించింది. ఈ క్రమంలో విపక్షాలన్నీ మోడీ సర్కార్ను ఏకీ పారేస్తున్నాయి. పార్లమెంట్లో మోడీ ప్రకటన చేయాలని ఉభయసభలను అడ్డుకుంటున్నాయి. దీంతో రాజ్నాథ్ సింగ్ కల్పించుకొని .. అదేం లేదని చెప్పారు. అలాంటి సందర్భమే లేదని .. ఊహాతీతంగా మాట్లాడిన అంశాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా మోడీ వైఖరిని తప్పుపట్టారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని .. లేదంటే 1972 నాటి సిమ్లా ఒప్పందానికి మోడీ తూట్లు పొడిచారని భావిస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications