రిపోర్టర్గా వచ్చి ఇంటర్వ్యూ: ఇంటర్ యువతిని కిడ్నాప్ చేశాడు
చెన్నై: తమిళనాడులోని విరుధునగర్లో టీవీ రిపోర్టనంటూ వచ్చి ఓ ఇంటర్ విద్యార్థినిని ఇంటర్వ్యూ చేశాడు ఓ దుండగుడు. ఆ తర్వాత కలెక్టరేట్ తరపున నగదు బహుమతి ఇస్తున్నారంటూ కారులో ఎక్కించుకుని ఆమెను కిడ్నాప్ చేశాడు దుర్మార్గుడు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
వివరాల్లోకి వెళితే.. తమ కూతురు ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో పాసవడంతోపాటు స్టేట్ లెవెల్ ర్యాంక్ రావడంతో ఆ తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు. కాగా, స్టేట్ లెవెల్ ర్యాంకు సాధించిన సెల్వీని ఇంటర్వ్యూ చేస్తానంటూ ఓ వ్యక్తి టీవీ రిపోర్టర్ పేరుతో వారింటికి వచ్చాడు.
'సాధారణంగా ర్యాంకర్స్ను ఇంటర్వ్యూ చేయడానికి టీవీ ఛానెల్స్ వాళ్లు వస్తుంటారు కదా.. ఇతను కూడా అలా వచ్చిన వాడే' అని ఆ తల్లితండ్రులు భ్రమపడ్డారు. కాగా, వచ్చిన ఆ వ్యక్తి సెల్వీని ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ అయిపోగానే సెల్వీ తల్లిదండ్రులను పిలిచి వారికి ఓ విషయం చెప్పాడు.
సెల్వీ ర్యాంకు సాధించినందుకు కలెక్టరేట్ నుంచి 50వేలు ఇస్తారని నమ్మబలికాడు. సెల్వీని తన వాహనంపై ఎక్కించుకుని వెళ్లాడు. కాగా, ఆమె తల్లిదండ్రులు బస్సులో కలెక్టరేట్కు వెళ్లారు.
తమ కుమార్తెను తీసుకెళ్లిన వ్యక్తి పేరుతో పేరుతో ఇక్కడకు ఎవరూ రాలేదంటూ కలెక్టరేట్ సిబ్బంది చెప్పడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం చేయాలో తెలియక.. సదరు టీవీ ఛానెల్కు వెళ్లి విచారించారు.
అయితే, విజయ్ ఆనంద్ అనే పేరుతో ఎవరూ లేరని ఛానెల్ యాజమాన్యం తెలిపింది. దీంతో తమ కూతురు కిడ్నాప్నకు గురైందని గ్రహించారు. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ కూతురు కిడ్నాపైందంటూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.