జయలలిత మళ్లీ సీఎం కావాలి: స్వర్ణరథోత్సవం
తిరుత్తణి: జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆశయంతో అన్నాడీఎంకే శ్రేణులు తిరుత్తణిలోని సుబ్రమణ్య స్వామి దేవాలయంలో స్వర్ణరథోత్సవం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంలో నాయకులతో పాటు వందలాధి మంది కార్యకర్తలు పాల్గోన్నారు.
జయలలిత ఆరోగ్యంగా జీవించాలని, అలాగే త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆశయంతో నాయకులు ఆమె జన్మనక్షత్రం మహం నక్షత్రం సందర్బంగా రాత్రి తిరుత్తణి ఆలయంలో విశిష్ట పూజలు, స్వర్ణరథోత్సవం నిర్వహించారు.
తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడు వేలంజేరి చంద్రన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాడిపరిశ్రమల శాఖ మంత్రి బీ.వీ. రమణ పాల్గోన్నారు.
ముందుగా తిరుత్తిణిలోని సుబ్రమణ్యస్వామికి విశిష్ట అభిషేక ఆరాధన పూజలు నిర్వహించారు. తరువాత మేళతాళాల నడుమ ఆలయం నుంచి వల్లి దేవసేన సమేత ఉత్సవర్లు షణ్ముఖస్వామిని స్వర్ణరథంలో కొలువు తీర్చారు.
హారోంహర నామస్మరణాల నడుమ ఆలయ మూడ వీధుల్లో విహరించారు. అనంతరం నిరుపేద కుటుంబాలకు చెందిన 200 మంది వృద్దులకు చీరలు, ధోవతులు పంపిణి చేశారు. ఇదే సందర్బంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.